హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు ఢిల్లీకి సూట్కేసులు మోస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. రాహుల్గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెదిరిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుడు వెల్లాల రామ్మోహన్ తన అనుచరులతో కలిసి శుక్రవారం హైదరాబాద్లో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక కాంగ్రెస్ నుంచి సూట్ కేసులు వస్తే.. ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతాయని, ఆరు గ్యారెంటీలను మాత్రం అమలు చేయడం లేదని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ అవమానిస్తే, మోదీ ప్రభుత్వం గౌరవించిందని చెప్పారు. తొమ్మిదన్నరేండ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిందని వివరించారు.
గిరిజనుల ఆత్మగౌరవ పోరాటయోధుడు రాంజీ గోండు పేరిట హైదరాబాద్ అబిడ్స్లో స్మారక మ్యూజియాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు వర్చువల్గా హాజరైన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి మ్యూజియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడారు. గిరిజనుల ఆత్మగౌరవం కోసం బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా రాంజీ గోండు పోరాడారని కొనియాడారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మాసబ్ ట్యాంకులో రూ.6.5 కోట్లతో ట్రైబల్ రిసెర్చి ఇన్స్టిట్ట్యూట్ ప్రారంభించినట్టు తెలిపారు. గిరిజన విద్యను ప్రోత్సహించడానికి రూ.420 కోట్లతో తెలంగాణలో 17 ఏకలవ్య ఇన్స్టిట్యూట్లను కేంద్రం ప్రారంభించిందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.