హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర జలాల వినియోగ అంశాలపై కేంద్ర జల్శక్తిశాఖ ఇటీవల ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ 27న తొలిసారి భేటీ కానున్నది. ఢిలీల్లో సీడబ్ల్యూసీ కార్యాలయంలో 27న మధ్యాహ్నం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సీఈ నేతృత్వంలో సమావేశం కొనసాగనున్నది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలపై చర్చించనున్నది. ఈ మేరకు కమిటీ మెంబర్లకు శుక్రవారం సమాచారం అందించింది. తుంగభద్ర జలాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయింపులు ఉన్నాయి. నీటి సమస్యలపై కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు గతనెల భేటీ అయ్యారు. సమస్యలు పరిష్కరించే బాధ్యతను కేంద్రానికి అప్పగించారు. ఈ నేపథ్యంలో సదరు కమిటీ తొలిసారిగా ఢిల్లీలో 27న భేటీ కానున్నది.