గొల్లకుర్మల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపే ఉదాత్త లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తమవల్ల కాదంటూ పథకాన్ని అటకెక్కించేసింది. లబ్ధిదారులు డీడీల రూపంలో చెల్లించిన సొమ్మును తిరిగి వారి ఖాతాల్లో జమచేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై గొల్లకురుమలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు వస్తాయని ఆశతో ఎదురు చూసి సర్కారు చేతిలో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Congress Govt | హైదరాబాద్/కరీంనగర్, మే 25 (నమన్తే తెలంగాణ ప్రతినిధి): కులవృత్తులకు జీవం పోసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేసీఆర్ సర్కారు గొర్రెల పంపిణీ పథకాన్ని 2017 జూన్లో ప్రారంభించింది. దశలవారీగా అర్హులైన ప్రతి కుటుంబానికి సబ్సిడీ కింద గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 8,109 సొసైటీలను ఏర్పాటు చేయటమే కాదు, 7,32,368 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందించాలని భావించింది.
ఆ మేరకు మొదటి విడతలో 3,83,552 యూనిట్లను అందించింది. రెండో విడతలో 3,37,816 యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో యూనిట్కు అయ్యే ఖర్చు రూ.1,75,000 కాగా, అందులో లబ్ధిదారుల వాటా రూ.43,750, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,31,350. గొర్రెలపెంపకందారులు తమ వాటా కింద రూ.43,750కి డీడీలు చెల్లించారు. మొదటి దఫాలో జరిగిన కొన్ని పొరపాట్లు రెండో విడతలో జరగకుండా నాటి ప్రభుత్వం పకడ్బందీగా ఆదేశాలు జారీచేసింది.
గొర్రెల యూనిట్ కొనుగోళ్లకు సంబంధించి మొదటి నుంచి చివరి వరకు ఈ-లాబ్ అనే పోర్టల్ (బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్) ద్వారా పర్యవేక్షణ చేసేలా ఏర్పాట్లు చేసింది. కొనుగోలు చేసేందుకు వెళ్లిన వాహనాలను జీపీఆర్ఎస్ విధానంతో ట్రాక్ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. అసలు వాహనంలో గొర్రెలు ఉన్నాయా? లేవా? అని ఇతర శాఖల అధికారుల బృందాలతో మార్గమధ్యంలో తనిఖీ చేయించేందుకు నిర్ణయం తీసుకొన్నది.
అక్కడితో అగకుండా లబ్ధిదారులు గొర్రెలు కొనుగోలు చేశాక, తన ఇష్టప్రకారంగానే కొన్నామని ఇంటికి వచ్చాక తనకు గొర్రెలు అందాయనే వీడియోను చిత్రించేలా ఆదేశాలు ఇచ్చింది. గతంలో కొనుగోళ్ల బాధ్యతల్లో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్లను తప్పించి జిల్లాస్థాయి అధికారులకు, మండలాల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఆ మేరకు రెండో విడతలో లబ్ధిదారులకు కొన్ని యూనిట్లు పంపిణీ చేసింది. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో 3,404 యూనిట్లకుగానూ 718 యూనిట్లు ఇచ్చింది. మిగిలినవి పంపిణీ చేసే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావటంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది.
చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామంటూ హామీల వర్షం కురిపించింది. 16వ అంశం కింద.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండో దశ గొర్రెల పంపిణీ చేపడుతామని గొల్లకుర్మలకు హామీ ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గొల్లకుర్మలు ఆందోళనలు చేపట్టారు. సంబంధిత సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. యూనిట్లు ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలని డిమాండ్ చేశాయి.
అయినా అధికారుల నుంచి సమాధానం రాకపోవటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న కొంతమంది కనీసం తమ డబ్బులైనా తిరిగి ఇచ్చేయాలని అడిగారు. ఇదే అదనుగా భావించిన రేవంత్ ప్రభుత్వం.. గత రెండు రోజులుగా డీడీలు చెల్లించిన వ్యక్తుల ఖాతాల్లోనే తిరిగి డబ్బులను జమ చేస్తున్నది. ఉదాహరణకు చూస్తే.. కరీంనగర్ జిల్లాలో 3,404 మంది లబ్ధిదారులు గొర్రెల యూనిట్లకోసం తమ వాటా చెల్లించగా, అందులో 718 మందికి ఇప్పటికే డబ్బులను వెనక్కి ఇచ్చేసింది. మరో 975 మందికి చెల్లింపు కోసం కలెక్టర్ వద్ద ఫైల్ పెండింగ్లో ఉన్నది. మిగిలిన వారికి దశలవారీగా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది.
మరో పథకానికి ఎగనామం
వడ్లకు రూ.500 బోసన్ ఇస్తామని ముందుగా మ్యానిఫెస్టోలో ప్రకటించి చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు.. గొల్లకుర్మలను కూడా అదే కోవలోకి నెట్టింది. గొర్రెల పంపిణీ పథకానికి ఎగనామం పెట్టినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం తమ నోట్లో మట్టికొట్టిందని గొల్లకుర్మలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకం కొనసాగింపు, రద్దుపై ఒక్క ప్రకటన కూడా చేయకుండా దొంగచాటుగా డీడీలను వాపస్ ఇవ్వటం ఏమిటని మండిపడుతున్నారు.
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా మా రేకొండలో 47 మంది దరఖాస్తు చేసుకున్నం. లబ్ధిదారుడి వాటా కింద రూ.43,750 డీడీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించినం. కేసీఆర్ ప్రభుత్వం రెండో విడతలో గొర్రెలు పంపిణీ చేస్తదనుకున్న టైంలో ఎలక్షన్లు వచ్చినయ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. లబ్ధిదారులు కట్టిన డబ్బలను తిరిగి ఖాతాల్లో జమ చేసింది. యాదవులకు తీరని అన్యాయం చేసింది.
-చందవేణి కుమారస్వామి, రేకొండ
కాంగ్రెస్ సరారుతో ఉపాధి కోల్పోయినం
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గొల్లకుర్మలను బలోపేతం చేసేందుకు గొర్రెల పంపిణీ పథకం తెచ్చిండు. అందులో భాగంగా మొదటి విడతగా చాలామందికి గొర్రెలు ఇచ్చిండు. దానితో ఎందరో జీవనోపాధి పొందిన్రు. రెండో విడత కూడా అందిస్తామని కేసీఆర్ చెప్పిండు. దాంతో లబ్ధిదారుడి వాటా కింద రూ.43,750 ప్రభుత్వానికి జమచేసినం. ఇప్పుడు ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గొర్రెల పంపిణీ పథకం బాగాలేదని, రెండో విడత గొర్రెల పంపిణీ చేయలేమని మంగళవారం అందరి అకౌంట్లో తిరిగి డబ్బులు వేసింది. కాంగ్రెస్ సర్కారుతో ఉపాధి కోల్పోయినం. మంత్రి పొన్నం ప్రభాకర్కు మా సమస్యలు చెప్పి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేదు.
– పోతరవేణి నర్సయ్య, లబ్ధిదారుడు, నవాబ్పేట్