నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 11: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దిగుబడుల కొనుగోలులో తాత్సారంపై తీవ్రంగా మండిపడ్డారు. తీవ్రజాప్యంతో రైతులు కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వర్షానికి మక్కలు, ధాన్యం తడుస్తున్నా సర్కార్లో చలనం లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
నల్లగొండ కలెక్టరేట్ ముట్టడి..
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్లగొండ కలెక్టరేట్ను ముట్టడించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లి సుమారు గంటపాటు కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించినా, రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తల పెద్ద సంఖ్యలో ఉండటంతో నిలువరించలేకపోయారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. రైతులను ఆదుకోవాలని, ధాన్యంలో తరుగు, తాలు పేరుతో ఆగం చెయ్యొద్దని నినదించారు. కలెక్టర్ బయటకు వచ్చి రైతుల గోడు వినాలని డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్తోపాటు గ్రీవెన్స్లో దరఖాస్తులు తీసుకుంటున్న అధికారులు బయటకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
రేవంత్ సర్కార్కు కనికరం లేదా?
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్లో మక్క బస్తాలు తరలించకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సోమవారం అక్కడికి వెళ్లారు. వర్షానికి తడిసిన మక్కలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత కన్నీళ్లు పెట్టుకుంటుంటే రేవంత్ సర్కార్ మాత్రం కనికరం లేకుండా ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తున్నదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. అకాల వర్షానికి తడిసిన మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం కొనుగోలు కేంద్రం వద్ద ఆ పార్టీ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ రైతులతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, టార్పాలిన్లు లేకపోవడంతో వర్షానికి మక్కలు తడిసి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ముగ్గురు మంత్రులు ఉన్నా లాభం లేదు..
ఖమ్మం జిల్లా వేంనూరు మండలం మర్లపాడు, కల్లూరుగూడెంలోని మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సండ్ర మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి పంట పండించిన రైతులు అమ్ముకోవడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని మండిపడ్డారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంలో జాప్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారం గ్రామ పంచాయతీ పరిధిలోని గణేశ్పల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బట్టపల్లి, పోతారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదని, కొనుగోలు చేసిన ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.