యాదగిరిగుట్ట, జూన్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న రైతుభరోసా రైతులకు నిరాశే మిగులుస్తున్నది. వారికి ఉన్న భూమిలో కొంత మేరకే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసి సర్కార్ చేతులు దులుపుకొంటున్నది. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఏవో కార్యాలయానికి పలు గ్రామాలకు చెందిన రైతులు వచ్చి తమకు అరకొరగా రైతుభరోసా నగదు జమైందని, ఎంతవరకు పడిందో అర్థం కావడంలేదని వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. ఇంతకి రైతు భరోసా వస్తుందా రాదా? అంటూ నిలదీయడంతో అధికారులు ఇబ్బందిపడ్డారు. మరికొద్దిరోజుల్లో అందరికీ రైతు భరోసా అందుతుందని సమాధానం చెప్పడమే తప్ప వారి వద్ద సరైన సమాధానం లేకుండాపోయింది. తనకున్న వ్యవసాయ భూమికి ఇప్పటివరకు రైతుభరోసా రాలేదని గౌరాయిపల్లికి చెందిన రైతు వనగంటి సత్తయ్య ఆందోళన వ్యక్తంచేశారు.
రూ.2000 ఖాతాలో జమయ్యాయని, అవి ఎక్కడివో అర్థం కావడంలేదని అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. రామాజీపేటకు చెందిన రైతు తునికి ఆంజనేయులు తనకు ఉన్న 5 ఎకరాల భూమికి గతంలో రైతుబంధు నగదు ఖాతాల్లో జమయ్యేదని, కానీ గత రెండు దఫాలుగా రైతుభరోసాతో పాటు రుణమాఫీ సైతం మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సొంత మండలంలోనే రైతులకు రైతు భరోసా మంజూరు కాలేదంటే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకు రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మిగతా భూమికి ఇస్తరో లేదో?
నాకు 2.09 ఎకరాల పట్టా భూమి ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో రైతుబంధు ఖాతాలో జమ అయ్యేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుభరోసా రాకపోగా ఈసారి కేవలం 25 గుంటలకు మాత్రమే రైతు భరోసా అందింది. మిగతా భూమికి ఇస్తరో లేదో తెలుస్తలేదు.
– రామిరెడ్డి, గౌరాయిపల్లి, మం: యాదగిరిగుట్ట