హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సింగూరు డ్యామ్ మరమ్మతులకు ప్రణాళికలు సిద్ధం చేసి 2 నెలలు గడిచినా అడుగు ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. డ్యామ్లోని నీటి విడుదలపై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డు) ససేమిరా అనడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ప్రభుత్వమూ పట్టించుకోకపోవడంతో ఇ రిగేషన్శాఖ అధికారులు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
సింగూరు డ్యామ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్(డీఎస్ఆర్పీ) బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా డ్యామ్ భద్రతకు చర్యలు చేపట్టాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదలశాఖ స్పందించింది. ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా డ్యామ్ మరమ్మతులను రెండు దఫాలుగా చేపట్టాలని గత డిసెంబర్లోనే నిర్ణయించింది. రూ.13 కోట్లతో టెండర్ అగ్రిమెంట్లు పూర్తిచేశారు. తొలుత 517.5 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వరకు నీటిని ఖాళీ చేసి, మరమ్మతు లు చేపట్టాలని ప్రతిపాదించారు. రెండో దఫాలో 517.5 నుంచి 510 క్రస్ట్ లెవల్ వరకు మరమ్మతులు నిర్వహించేందుకు ఇరిగేషన్శాఖ సిద్ధమైంది. కానీ, ఆ పనులు అక్కడే నిలిచిపోయాయి.
సింగూర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 29టీఎంసీలు. ఆనకట్ట వాస్తవ డిజైన్ ప్రకారం రిజర్వాయర్ స్థాయిని 517.8 మీటర్లు కాగా, ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం కోసం రిజర్వాయర్ కనీస స్థాయిని 522 మీటర్ల కంటే ఎకువగా నిర్వహిస్తున్నారు. అదీగాక డ్యామ్ పూర్తిగా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నది. మరమ్మతులకు డ్యామ్ను ఖాళీ చేయాలని హెచ్ఎండబ్ల్యూఎస్కు లేఖ రాసింది. ఈ ప్రతిపాదనలపై హెచ్ఎండబ్ల్యూఎస్ను తోసిపుచ్చడంతో పనులు నిలిచిపోయినట్టు తెలుస్తున్నది. పనులు నిలిచిపోవడంతో ఇరిగేషన్శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సైతం నివేదించారు. కానీ, స్పందన రాలేదని తెలుస్తున్నది.