మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అలవిగాని, ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసగించిందని విమర్శించారు. శంషాబాద్లో బుధవారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాసాని గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటాలని అన్నారు. కేసీఆర్ను ఎదుర్కోలేక కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల స్థానంలో భారీ మెజారిటీ సాధించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా ప్రచారం కొనసాగించాలని సూచించారు.