Koppula Eshwar | రాష్ట్రంలో 200 మంది రైతుల ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పోచమ్మవాడ సమీపంలో నీళ్లు లేక ఎండి పోయిన పంట పొలాలను పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండిన పంటలను చూసి రోదిస్తున్న రైతులను ఓదార్చారు.
అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు ఉన్నన్ని రోజులు రైతులకు సాగునీటి కష్టాలు, కరెంట్ బాధలు అంటే ఏంటో కూడా తెలియకుండా పోయాయని తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతులను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో సాగునీరు ఇవ్వక పోవడంతో వేలాది ఎకరాల వరి పంటలు నాశనమై రైతులు లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు. రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో, సీఎం రేవంత్రెడ్డిలో చలనం రావడం లేదన్నారు. సాగునీరు ఇవ్వకపోగా రైతులను హేళన చేసినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతులు ఇన్ని కష్టాలు పడుతున్నా ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి సాగునీరు విడుదల చేయడంతోపాటు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం అందించాలని, ధాన్యానికి రూ.500ల బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.