తొర్రూరు, జనవరి 4 : సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలో జీకే తండా, వెంకటాపురం గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఇన్సూరెన్స్ చెకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొర్రూర్ డివిజన్ కేంద్రంలో మున్సిపాలిటీ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినప్పటికీ నిధులు ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరని విమర్శించారు. పార్టీని నమ్ముకున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దేశంలో పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా కాపాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో కమిటీలతోపాటు అనుబంధ కమిటీలను వేస్తామని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తంచేశారు.