హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భూభారతి చట్టం తో కాంగ్రెస్ సర్కార్ నవ్వుల పాలైందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరిట రాష్ట్రంలో భారీ భూదోపిడీ జరుగుతున్నదని ఆరోపించారు. పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు విచ్చలవిడిగా సెటిల్మెంట్ల దందా సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, దేవాదాయ భూములు మాత్రమే ఉండాల్సిన 22ఏ జాబితాలోకి దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తూ, నివాసాలు ఉంటున్న ప్రైవేట్ ఇండ్లు, స్థలాలను ఉద్దేశపూర్వకంగా చేర్చి సెటిల్మెంట్ల పేరిట 50 శాతం కమీషన్లు దం డుకుంటున్నారని మండిపడ్డారు. వంద ఎకరాలు ఉంటే లిటిగేషన్ క్లియర్ చేస్తా.. 50 ఎకరాలు ఇస్తావా? అన్నరీతిలో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు 4 లక్షల ఎకరాల భూ ములను రాత్రికి రాత్రే అక్రమంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను భద్రంగా ఉంచాలంటే ఆర్మీని దింపాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉన్నదో అర్థమవుతున్నదని చెప్పారు. రెండేండ్లలో 22ఏలో చేర్చిన, తొలగించిన భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు, విద్యార్థినులకు స్కూటీలు ఎక్కడ? అని ప్రశ్నించారు.
నిషేధిత జాబితాలో భూములను ఎవరు చేరుస్తున్నారని అడిగితే సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి, అధికారులు.. తమకు తెలియదంటూ ఎవరికి వారు దోబూచులాడుతున్నారని కిషన్రెడ్డి మండిపడ్డారు. 22ఏలో తప్పులు దొర్లాయని మంత్రి క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడం కోసమే తన భూమి సైతం 22ఏలో ఉన్నదని సీఎం బుకాయ్తిన్నారని ఆరోపించారు. రాష్ట్రం ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో 22ఏ విషయంలో కలెక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తూ వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఏ అధికారి 6 నెలలు ఒకే చోట పనిచేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సర్కార్ నిర్వాకం వల్లే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.