Kishan Reddy | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తులు అవసరం లేకుండానే ఆరు గ్యారెంటీలు అమలు చేయవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దరఖాస్తుల విషయంలో పూర్తిగా రాజకీయమే కనిపిస్తున్నదని విమర్శించారు. కాలయాపన చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. రేషన్కార్డులు, ఉద్యమకారులు జైలుకు వెళ్లిన వివరాలన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయని గుర్తు చేశారు.
దరఖాస్తుల పేరుతో ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైళ్ల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇస్తామన్న రూ.2500 దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఇస్తారా? లేదంటే అందరికీ ఇస్తారా?అన్న విషయంలో స్పష్ట త లేదని విమర్శించారు. 22న అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని అన్ని ఆలయాల్లోనూ లైవ్లో వీక్షించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 14 నుంచి 22వ తేదీ వరకు దేశంలోని పుణ్యస్థలాలు, దేవాలయాల ప్రాంగణాల్లో స్వచ్ఛత అభియాన్ నిర్వహించనున్నట్టు చెప్పారు. 22న ఇంటింటా ముగ్గులు, పచ్చతోరణాలతో అలంకరించడంతో పాటు 5 శ్రీరామజ్యోతులను వెలిగించాలని కిషన్రెడ్డి కోరారు.