Kishan Reddy | హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దేవుళ్లపై ఒట్ల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ పంగనామం పెట్టిందని విమర్శించారు. క్వింటాల్కు రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని అన్నారు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటున్నారని సీరియస్ అయ్యారు.
రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని.. చాలా తక్కువ మంది మాత్రమే సన్న వడ్లు పండిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. దొడ్డు వడ్లను కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వర్షాలకు ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న 75వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని.. ఇలాగే కొనసాగితే మొత్తం ధాన్యం కొనేందుకు రెండు నెలల సమయం పడుతుందని మండిపడ్డారు. వర్షాలు పడి ధాన్యం మొలకలు వస్తుంటే.. బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.