BRS | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 2.04 శాతంగా ఉన్నది. ఓట్ల పరంగా చూస్తే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు 4,78,379 ఓట్లు అధికంగా పడ్డాయి. దీంతో ఆ పార్టీ బీఆర్ఎస్ కన్నా 25 సీట్లు అధికంగా గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీకి 39.40 శాతం ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. సీట్ల పరంగా అయితే సీపీఐతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్కు రెండు పార్టీల ఓట్లు కలిపితే 39.69 శాతంగా ఉన్నాయి.
బీజేపీకి 13.89 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే 6.91 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సారి గణనీయంగా ఓట్లను పెంచుకున్నది. అనూహ్యంగా నోటాకు 1,71,884 ఓట్లు పడ్డాయి.