కంది, ఏప్రిల్ 5: ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ విమర్శించారు. గ్యారెంటీల అమలుతోపాటు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రైతు సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవగానే రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు ఆ హామీని విస్మరించిందని దుయ్యబట్టారు.
రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని, రైతు కూలీలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే డిసెంబర్ 9న హామీలు అమలు చేస్తామని ప్రకటించి, ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో గెలిపించండి రాహుల్గాంధీ ప్రధాని కాగానే నెరవేర్చుతామని అసత్యాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. మాట తప్పిన కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.