పరిగి, ఫిబ్రవరి 2 :వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఓవైపు రాడార్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి భాగస్వామ్యం గల వివిధ ప్రభుత్వ శాఖలపై కోర్టుల్లో వేర్వేరుగా కేసులు, ఎన్జీటీలో కేసులతోపాటు ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వం మెడలు వంచేలా కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నారు. నేవీ రాడార్తో సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల మేరకు రేడియేషన్ ప్రభావం ఉంటుందని పర్యావరణవేత్తలు చెప్తుండటంతో హైదరాబాద్కు సైతం ముప్పు పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దామగుండం అడవి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘ప్రకృతి విధ్వంసం-పరిణామాలు‘పై పరిగిలోని బృందావన్ గార్డెన్లో శుక్రవారం చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ బీ విజయ్కుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన సాంకేతిక విజ్ఞానం ప్రజలకు ఉపయోగపడాలి కానీ, ప్రజల జీవితాలను నాశనం చేసేలా ఉండకూడదని సూచించారు. లక్షలాది చెట్ల నరికివేతతో కలిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వారందరినీ ఉద్యమంలోకి తీసుకురావాలని అన్నారు.
నేవీ రాడార్ ఫైల్ దుమ్ము దులిపి అనుమతి ఇచ్చామని చెప్పిన మంత్రి కొండా సురేఖ, ఆ వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేయడం తగదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ నాగేందర్గౌడ్ అన్నారు. నేవీ రాడార్ ఏర్పాటుపై ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి విపరీతమైన ఆతృతతో ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను శివరాత్రి రోజు దామగుండం క్షేత్రానికి తీసుకురావడం ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టులకు భయపడకుండా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దామగుండం అటవీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మురళీధర్ దేశ్పాండే మాట్లాడుతూ.. ఒకే ప్రాంతంలో అనంతగిరి-దామగుండం జంట అడవులు దేశంలో ఎక్కడా లేవని, అత్యంత చక్కటి వాతావరణం గల అడవి పరిరక్షణకు పోరాటం చేస్తామని అన్నా రు. దామగుండం ప్రకృతి ప్రేమికులు సత్యానందస్వామి మాట్లాడుతూ.. నేవీ రాడార్ ఏర్పాటుతో రేడియేషన్ వల్ల కలిగే దుష్ర్పభావాలపై యువత అవగాహన పెంపొందించుకొని ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. రాడార్ను అడ్డుకోవడం ద్వారా నే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని నార్మాక్స్ మాజీ డైరెక్టర్ బీ ప్రవీణ్కుమార్రెడ్డి అన్నారు.