Rani Rudrama | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీది సుపరిపాలన కాదని, సుపారీ పాలన అని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆమె రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ది పాకిస్థాన్ డీఎన్ఏ అని, ఆ పార్టీ 40 సీట్లు కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని విరుచుకుపడ్డారు. జాతీయ రాజకీయాలపై సీఎం రేవంత్రెడ్డికి అవగాహన లేదని, అందుకే బీఆర్ఎస్కు బీజేపీ సుపారీ ఇచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు రూ.15 వేలు, వడ్లకు బోనస్, రూ.2 లక్షల రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఎప్పుడిస్తారో చెప్పాలని రేవంత్రెడ్డిని డిమాండ్ చేశారు.