హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో విడుతల వారిగా దోచుకునే బ్యాచ్ తయారైందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టరు ఎర్రోళ్ల శ్రీనివాస్ ( Errolla Srinivas ) ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ( Congress ) నాయకులపై అవినీతి ఆరోపణలు రాగానే ఒక్కొకరు బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నుంచి మొదలు క్రింది స్థాయి నేతల వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యడంలో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. హ్యమ్ మోడల్ రోడ్లలో 25 శాతం ఎక్సెస్ టెండర్లు వేశారని హరీష్ రావు( Harish Rao ) ఆధారాలతో సహ మీడియాకు వివరిస్తే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ అడ్డంకి దయాకర్గా మారారని వెల్లడించారు. కాంగ్రెస్ పాలన అంటేనే కరప్షన్ పాలన అని ఎద్దేవా చేశారు.
హ్యమ్ మోడల్ రోడ్లలో బిడ్ ఓపెన్ అయిందా లేదా? ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కొత్వాల్ గూడలో రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద అక్రమంగా పనులు జరుగుతున్నాయని ఆధారాలతో సహ బయటపెడితే దాని పై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు క్రింది స్థాయి వరకు బూతులు మాట్లాడడమే సరిపోతుందని ఆరోపించారు.
తెలంగాణలో బట్టి ట్యాక్స్, పొన్నం ట్యాక్స్, పొంగులేటి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్ నడుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ హయంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని అమల్లోకి తెచ్చి ప్రజల సొమ్మును కొల్లగొడుతుందని తెలిపారు .
28 నెలల కాంగ్రెస్ పాలనలో 28 శాఖల్లో అవినీతి జరిగిందని, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు దమ్ముంటే వీటి పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గోసుల శ్రీనివాస్ యాదవ్, అభిలాష్ రంగినేని ,రాఘవేంధ్ర యాదవ్ ,కె .కిషోర్ గౌడ్, తుంగ బాలు ,ఏ .హరిబాబు తదితరులు పాల్గొన్నారు.