హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ అభ్యర్థుల ఖరారు కోసం మంగళవారం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎట్టకేలకు 8 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మిగిలిన 5 కీలక నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో పెండింగ్ పెట్టినట్టు తెలిసింది. ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను బుధవారం ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని ఈ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
కొత్త గవర్నర్గా రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణం ఉండటంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ హైదరాబాద్కు వచ్చేయటంతో, పెండింగ్ స్థానాలపై 21న సమావేశమై ఖరారు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొత్తం 17 నియోజకవర్గాలకుగానూ మొదటి జాబితాలో నల్లగొండ, మహబూబ్నగర్, మహబూబాబాద్, జహీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
తాజాగా మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంతో ఇంకా 5 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. పార్టీలో కొత్తగా చేరిన ఎంపీ రంజిత్రెడ్డికి చేవెళ్ల, ఎమ్మెల్యే దానం నాగేందర్కు సికింద్రాబాద్, మల్కాజిగిరిలో సునీతామహేందర్రెడ్డికి ఎంపీ టికెట్లు దక్కుతాయని భావించినప్పటికీ, వీరి అభ్యర్థిత్వాలపై నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో అనుకూలంగా రాలేదని సమాచారం. ఖమ్మం, భువనగిరి స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఈ ఐదింటిని పెండింగ్లో పెట్టినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.