Hairsh Rao | ఆరు గ్యారంటీల తరహాలోనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా? అంటూ ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ నేతలు జాతీయ నాయకులతో ఢిల్లీ వేదికగా కోట్లాడాలని హితవు పలికారు. కలిసి వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్రెడ్డి.. గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారు తప్పా.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ధి ప్రదర్శించలేదని విమర్శించారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్రెడ్డి తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారని.. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారని.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపాలని.. బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలని చెప్పారు. పార్లమెంట్లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చాలని.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించాలని.. ద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుందని.. ఢిల్లీని నిలదీస్తుందన్నారు.