Jagan | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విప్లవ పోరాటాలపై కాంగ్రెస్ కొనసాగిస్తున్న హింసాకాండను వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ బహిరంగ లేఖలో పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గ్రేహౌండ్స్ పోలీసులు చేపట్టిన ఏకపక్ష దాడిని ఖండించాలని కోరారు.
వారం రోజులుగా తమ కదలికలను గమనించిన గ్రేహౌండ్స్ బలగాలు ఈ నెల 5న వెంకటాపూర్ మండల పరిధిలోని అడవిలోకి ప్రవేశించి 6వ తేదీ తెల్లవారుజామున దాడి చేశాయని వెల్లడించారు. ఈ దాడిలో సంతోష్, మనీరామ్, లక్ష్మణ్ అమరులయ్యారని తెలిపారు. ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. కగార్ దాడిని నిరసిస్తూ ఈ నెల 15న బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపారు.