Kamareddy | నిజామాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజా బలాన్ని పొందలేకపోయిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తనదైన మార్కుతో గొడవలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచార పర్వం ముగిసింది. ఐదు తర్వాత స్థానికేతరులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలి. కానీ రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి మాత్రం ఎలక్షన్ ఏజెంట్ ధ్రువీకరణ పత్రం ఉందంటూ ఇక్కడే తిష్ట వేసుకుని ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. కామారెడ్డి పట్టణ నాయకుడి రియల్ ఎస్టేట్ ఆఫీస్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా రూ.60 లక్షలు లభించినట్టు సమాచారం.
ఎలెక్షన్ ఏజెంట్ పాస్ ఇప్పుడెందుకు?
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి ఎలక్షన్ ఏజెంట్ పాస్ పొందాడు. స్థానికేతరుడైన ఆయనకు పాస్ ఎందుకు అవసరం వచ్చిందన్నది ప్రశ్నగా మారింది. కొండల్రెడ్డి పేరు మీద జారీ చేసిన పాసులో స్వతంత్ర అభ్యర్థి తరపున పొందినట్టు తెలిసింది. అందులో వివరాలను ఏ కొండల్రెడ్డి అని పేర్కొన్నప్పటికీ పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు స్థానంలో వివరాలు సరిగా కనిపించకుండా జాగ్రత్త పడటం అనుమానాలకు తావిస్తున్నది. స్వతంత్ర అభ్యర్థి తరఫున ఏజెంట్ పాస్ ఎందుకు తీసుకున్నావని కొండల్రెడ్డిని ప్రశ్నిస్తే నోరు విప్పడం లేదు.
కాంగ్రెస్ నేత ఆఫీస్లో రూ.60 లక్షలు..
కాంగ్రెస్ పట్టణ నాయకుడు శ్రీనివాస్రెడ్డికి సంబంధించిన రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఎన్నికల సంఘం ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించగా రూ.60 లక్షల నగదు లభించింది. అయితే అధికారులు ధ్రువీకరించాల్సి ఉన్నది.
గొడవలకు కుట్ర?
పోలింగ్కు ముందు రోజు ఏదోరకంగా గొడవలు సృష్టించి జనాల్లో భయాందోళనలు సృష్టించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు పాల్పడుతున్నది. సోమవారం నాడు అర్ధరాత్రి భిక్కనూర్ మండలంలో అనుమానాస్పదంగా కర్ణాటకకు చెందిన వాహనాల్లో పలువురు సంచరించారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు , ప్రజలు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు.
పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టగా సర్వే కోసం వచ్చినట్టు వారు సమాధానమిచ్చారు. కాగా కామారెడ్డి శివారు దేవివిహార్లోని ఓ ఇంట్లో కాంగ్రెస్ నేతల హడావిడిని గుర్తించిన స్థానికు ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కంగుతిన్న నేతలంతా పోలీసులపై ఎదురు తిరిగారు. దేవునిపల్లి ఎస్సై రాజుపై తిరగబడటంతోపాటు శాంతి, భద్రతలకు ఆటంకం కలిగించేలా డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ కండ్ల ముందే ఇదంతా జరిగింది. ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్సై చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా పోలీసులనే కాంగ్రెస్ నేతలు బూతులు తిట్టారు.