హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, దీనిని ప్రపంచానికి తెలిపేందుకే తాము మేడిగడ్డకు వెళ్తున్నామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. నీటిపారుదల ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో కాం గ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ఆయన అనుమానం వ్యక్తంచేశారు.
ప్రభుత్వ కుట్రను, దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని తెలిపారు. ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతి పనిలోనూ అవినీతి అంటూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అతిపెద్ద అవినీతి జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఎలా చెప్తారని, ఆయన విచారణాధికారా? అని ప్రశ్నించారు. లక్ష కోట్లు ఖర్చు కానీ కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయ విచారణకు ఆదేశించినట్టు సీఎం చెప్పారని, విచారణలో తేలాల్సిన విషయాలను మంత్రి ఉత్తమ్ ఎలా చెప్తారని ప్రశ్నించారు.
మేడిగడ్డ పిల్లర్లను మరమ్మతు చేసి నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభివృద్ధి యాత్రలు చేయాలి కానీ, తమకు పోటీ యాత్రలు కాదని హితవు పలికారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెంటనే ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు అధికార దర్పంతో వ్యవహరిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని చూపే ప్రయత్నం, కుట్ర తగదని, ప్రజలు తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు.