కథలాపూర్, అక్టోబర్ 24: ‘రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. అందరినీ ఆగం పట్టిచ్చింది. కరెంట్ కోతలతో రైతులకు చుక్కలు చూపించింది. ఇప్పుడు మళ్లీ ఆగం చేసేందుకు ఆ పార్టీ నాయకులు వస్తున్నరు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలంటున్నారు. ఎట్ల సరిపోతదో మీరే చెప్పా లి. నేనొక్కటే చెబుతున్నా.. వాళ్లను నమ్మి తే తెలంగాణ మళ్లీ అంధకారం అవుతుంది. మళ్లీ పాతరోజులే వస్తయి’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హెచ్చరించారు. చేను నీళ్లు పెట్టేందుకు రాత్రిపూట లైట్లు పట్టుకొని బాయికాడికి పోయే రోజులు మళ్లీ అవసరమా? ఆలోచించాలని కోరారు. మంగళవారం జగిత్యాల జిల్లా కథలాపూర్లో వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు మద్దతు గా మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి ప్రచారం చేశారు.
అనంతరం వినోద్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేని వి ధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలువుతున్నాయని చెప్పారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నారని, ఎట్ల సరిపోతదో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో వ్యవసాయానికి పుష్కలంగా కరెంటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తు తం 5 గంటల కరెంట్ ఇస్తున్నదని, దీంతో అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మాటలు నమ్మితే పాతరోజులే వస్తాయని, రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోతుందని తెలిపారు. తెలంగాణను ఆగం పట్టించేందుకు కాంగ్రెస్ నేతలు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.