Congress | మహబూబ్నగర్/జడ్చర్ల, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం శుక్రవారం మేడిగడ్డ సందర్శనకు పిలుపునివ్వగా.. అందుకు కౌంటర్గా అదే రోజు హస్తం పార్టీ చేపట్టిన ‘పాలమూరురంగారెడ్డి’ రిజర్వాయర్ల సందర్శన ఆధ్యంతం విహారయాత్రగా సాగింది. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఉదయం 11 గంటలకు కరివెన, మధ్యాహ్నం 3 గంటలకు ఉదండాపూర్ రిజర్వాయర్లను సందర్శించి హడావిడి చేశారు. అక్కడ వారందరినీ డమ్మీ చేసి మీడియా ముందు అంతా వన్ మ్యాన్ షో నడిపారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ (పీఆర్ఎల్ఐ)పై పచ్చి అబద్ధాలు మాట్లాడిన వంశీచంద్.. వాటిని మీడియాకు చూపించకపోవడంతో యాత్ర తుస్సుమన్నది. ఈ ప్రాజెక్టుపై అవగాహనారాహిత్యంతో మాట్లాడటంతో అక్కడికి వచ్చిన మీడియా, రైతులు నవ్వుకున్నారు. ఈ యాత్ర రైతుల ప్రయోజనం కోసం చేసినట్టుగా లేదని, కాం గ్రెస్ ప్రజాప్రతినిధుల పిక్నిక్గా ఉందని చ ర్చించుకున్నారు. ఎత్తిపోతలపై పథకంపై అధికార పార్టీ స్టాండ్ ఏమిటో వివరించలేదని విమర్శలు వెల్లువెత్తాయి.
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగం గా మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టిన కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. ఉదండాపూర్ సర్జ్పూల్ పనులు పూర్తయి మోటర్లు బిగించే ప్రక్రియ నడుస్తున్నది. ఇటు వట్టెం రిజర్వాయర్ నుంచి అటు కరివెన రిజర్వాయర్ నుంచి ఉదండాపూర్ వరకు లింకు కెనాల్ పనులు కూడా సాఫీగా జరుగుతున్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు కేవలం రాజకీయ విమర్శలకు వాడుకోవడం కనిపించింది. భూత్పూర్ నుంచి భారీ కాన్వాయ్తో బయలుదేరిన హస్తం పార్టీ నేతలు తాటిపర్తి వద్ద కరివెన రిజర్వాయర్ కట్టపై ఎక్కి దాదాపు 6 కిలోమీటర్లు ప్రయాణించి కట్ట అటు ఇటు చూస్తూ నిశ్చేష్టులయ్యారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఇంత పని జరిగిం దా? అంటూ ముక్కున వేలేసుకున్నారు. అక్కడి నుంచి హడావిడిగా మీడియా పా యింట్ వద్దకు వచ్చి పాలమూరు ప్రజలపై కే సీఆర్కు ప్రేమ లేదన్నట్టు ఆరోపణలు చేశారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం ఒక ఇంజినీరింగ్ అద్భుతమని రాష్ట్ర ప్రజలంతా కొనియాడుతుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ ప్రాజెక్టుపై అబద్ధాలు వల్లించారు. ప్రాజెక్టు డిజైన్, సర్జ్పూల్, పంప్హౌస్, రిజర్వాయర్ల నిర్మాణం గురించి మాట్లాడకుండా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలు సంధించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ఏ విధంగా జరిగాయో? ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు. ఇదే కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుపై ఎన్ని కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారో.. దీన్ని కప్పిపుచ్చుతూ కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మీడియా ముందు మాట్లాడటాన్ని చూసిన రైతులు అవాక్కయ్యారు. పాలమూరు ఎత్తిపోతల స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో కూడా కాంగ్రెస్ నేతలకు తెలియదని తేటతెల్లమైంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం ఎన్ని టీఎంసీలు? ఎంత ఆయకట్టు? అనే విషయంలో కూడా నోటికొచ్చిన ఆయకట్టు వివరాలను చెప్పగా.. మీడియా అవాక్కైంది. కరివెన రిజర్వాయర్ నాసిరకంగా నిర్మించారని వంశీచందర్రెడ్డి విమర్శించారు. వర్షం నీళ్లకే సీపేజ్ వస్తున్నదని ఆరోపణలు గుప్పించిన ఆయన.. మీడియాకు మాత్రం ఎక్కడా చూపించలేదు. కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల సందర్శనకు వచ్చిన హస్తం పార్టీ నేతలు.. వాటి కింద ఉన్న రైతులను కనీసం పలుకరించకుండా వెళ్లిపోయారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్న శ్రీనివాసరెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, అనిరుధ్రెడ్డి, పర్నికారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నాయకులు సీతారాం తదితరులు పాల్గొన్నారు.