CWC | హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): కళ్లులేని కబోదిలా తయారయ్యారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు. రాష్ట్రంలో నిరంతరాయంగా జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ.. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని అబద్ధాలను వల్లెవేశారు. హైదరాబాద్లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం తమ అబద్ధాలతో రాష్ట్ర ప్రజలకు ఒక లేఖ రాసింది. మరోసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేసేందుకు ఓట్లు వేయాలంటూ ప్రాధేయపడింది.
రైతులు అప్పుల్లో కూరుకుపోయారా?
తెలంగాణ రైతులు, ప్రజలు నవ్వుకుంటారన్న కనీస సోయి కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన పచ్చి అబద్ధాలను వల్లె వేసింది. తెలంగాణ రైతులు అప్పు ఊబిలో కూరుకుపోయారంటూ ఏ మాత్రం నమ్మశక్యం కాని ఆరోపణను ఎత్తుకున్నది. రైతుబంధు, ఉచిత విద్యుత్తు ఇవ్వడంతోపాటు సాగునీటి సమస్యను పరిష్కరించి వ్యవసాయాన్ని పండుగ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నది. ఒక్క రైతుబంధు పథకం ద్వారానే ఇప్పటివరకు రూ. 75వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండుసార్లు రూ. లక్ష వరకు రుణాలను మాఫీ చేసింది. ఇందుకోసం రూ. 60వేల కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇలాంటి ప్రభుత్వంలో రైతులు అప్పుల్లో కూరుకుపోయారంటూ కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలను చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ గురవింద గింజను తలపిస్తున్నది. ఓవైపు కాంగ్రెస్ పార్టీని గాంధీల కుటుంబమే ఏలుతూ మరోవైపు రాష్ట్రంలో కుటుంబ పాలన అంటూ విమర్శించడం ఆ పార్టీకే చెల్లింది.
స్కూళ్లు, దవాఖానలు ప్రైవేటుపరం అవుతున్నాయట
ఇంతకన్నా దిగజారుడు ఆరోపణలు మరేవీ ఉండకపోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యను, వైద్యాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తెలంగాణ ఏర్పాటు కాకముందు 284 వరకు ఉన్నటువంటి గురుకులాలను 1019కి పెంచింది. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్ స్వయంగా తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. హైదరాబాద్ నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్నది. ఇలాంటి ప్రభుత్వం స్కూళ్లను, దవాఖానలను ప్రైవేటీకరణ చేస్తున్నదంటే అంతకన్నా దుర్మార్గమైన ఆరోపణ ఇంకేమైనా ఉంటుందా?