హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్ల గడవు గురువారం ముగియగా, కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్కు చెందిన మహేశ్కుమార్గౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బల్మూరి వెంకట్ ఇద్దరే నామినేషన్లు దాఖలుచేశారు. ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో మహేశ్కుమార్గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవం కానున్నారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం వీరిద్దరి ఎన్నికను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు.
వీరిద్దరి పదవీ కాలం 2027న ముగియనున్నది. ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఖాళీ అయిన ఈ రెండు స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ మేరకు నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగిసింది. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ మెజార్జీ కలిగి ఉండటంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఆ పార్టీకే దక్కనుండటంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తన అభ్యర్థులను బరిలోకి దించలేదు.