తెలంగాణలో ఏం నడుస్తున్నది? కాంగ్రెస్లో చీలికలు..బీజేపీలో లుకలుకలు..బీఆర్ఎస్లో చేరికలు..ఓ వైపు బీఆర్ఎస్ రెండోదశ ప్రచారాన్నీ పూర్తిచేయబోతుంటే కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల ఖరారు దగ్గరే ఆగిపోయాయి. కాంగ్రెస్ తొలి జాబితాతో అసంతృప్త సెగ మొదలవగా, రెండో జాబితాతో నిరసనజ్వాలలు మిన్నంటాయి. టికెట్ అమ్మకాల రచ్చ, రెబల్ నేతల హెచ్చరికలు, వరుస రాజీనామాల లొల్లితో ఏఐసీసీ నేతల ఎన్నికల ప్రచారయాత్రకు మధ్యలోనే బ్రేక్పడింది.
Congress | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): టికెట్ల అమ్మకాల లొల్లి, అంతర్గత కుమ్ములాటలతో ఆగమాగం అవుతున్న కాంగ్రెస్ చివరికి ప్రజలకు ముఖం చూపించలేక బస్సుయాత్రను కూడా రద్దు చేసుకున్నది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా.. మహబూబ్నగర్ నుంచి ఖమ్మం దాకా కాంగ్రెస్లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. టికెట్లు అమ్ముకున్నారంటూ మెజార్టీ నియోజకవర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రెండుమూడు వర్గాలుగా నేతలు విడిపోయి వేరు కుంపట్లు పెట్టుకున్నారు. ఈ చిచ్చు కాంగ్రెస్ను దహించి వేస్తున్నది. చివరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించతలపెట్టిన బస్సుయాత్రను రద్దు చేసుకున్నది. సోమవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ బస్సుయాత్ర జరుగాల్సి ఉన్నది. దీనికి రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ, ఖర్గే లాంటి నేతలు వస్తారని ప్రచారం చేశారు.
కానీ టికెట్లు అమ్ముకున్నారంటూ సొంత పార్టీ నేతలే రోడ్లెక్కడ్డం, ధర్నాలు చేస్తామని బెదిరించడం వంటి పరిణామాలు అగ్రనేతల దృష్టికి వెళ్లినట్టు సమాచారం. బస్సుయాత్రకు ముగ్గురు నేతల్లో ఎవరు హాజరవుతారనే అంశంపై ఆదివారం సాయంత్రం వరకు ఢిల్లీ నుంచి స్పష్టత రాలేదని, రాష్ట్ర నేతలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదని సమాచారం. ఇప్పటికే తాను నిర్వహించిన సభలతో ఎలాంటి ఫలితం లేదని, ఇకపై వచ్చినా ఒరిగేదేమీ లేదని రాహుల్గాంధీకి అర్థమైందని, తాను వచ్చినా వ్యర్థమని ప్రియాంక గుర్తించారని, రాష్ట్రంలో పార్టీ పరువు పాతాళంలో ఉన్నదని ఖర్గేకు ఆదివారం నర్సాపూర్లో నిర్వహించిన సభతో అవగతం అయ్యిందని పార్టీ అసంతృప్త నేతలు చెప్పుకుంటున్నారు. అంతర్గత కుమ్ములాటలు, టికెట్ల అమ్మకాల నిరసనలకు భయపడి పీసీసీ అధ్యక్షుడు, స్థానిక నేతలు కూడా ప్రచారం చేసుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ చెప్పుకోలేక ‘అనివార్య కారణాల వల్ల బస్సుయాత్రను రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
అన్ని నియోజకవర్గాల్లో ఆగమాగం
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా కాంగ్రెస్ ఆగమాగం అవుతున్నది. ఆదిలాబాద్లో కాంగ్రెస్ టికెట్ను కంది శ్రీనివాస్రెడ్డికి కేటాయించడంతో మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాజిద్ఖాన్ రాజీనామా చేశారు. దేవరకద్రలో జీ మధుసూదన్రెడ్డిని మార్చాలంటూ మండలాల్లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరిలో కల్లూరి రామచంద్రారెడ్డి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. కూకట్పల్లి టికెట్ ఆశించిన గొట్టిముక్కల వెంగళరావు కాంగ్రెస్ను వీడుతున్నట్టు ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన బీఆర్ఎస్లో చేరతానని ప్రకటించారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కని పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదివారం రాత్రి కలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాత నర్సింహారెడ్డితోపాటు మరో ముగ్గురు నేతలు కూడా స్థానికేతరుడైన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి మద్దతు ఇచ్చేది లేదని బాలాపూర్లో జరిగిన ముఖ్య సమావేశంలోనే పార్టీకి ఆల్టీమేటం జారీ చేశారు.
కోవర్ట్ కో హఠావో.. కాంగ్రెస్ కో బచావో
గాంధీభవన్ వద్ద నర్సాపూర్ నియోజకవర్గ అసంతృప్త నేతలు వీరంగం సృష్టించారు. గాలి అనిల్కుమార్కు టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు గాంధీభవన్ బయట నిరసన తెలిపారు. బీసీ బిడ్డకు అన్యాయం చేశారని, వెంటనే రాజిరెడ్డికి టిక్కెట్ రద్దు చేసి అనిల్కుమార్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘కోవర్ట్ కో హఠావో.. కాంగ్రెస్ కో బచావో’ అంటూ నినాదాలు చేశారు. ‘నర్సాపూర్లో కోవర్ట్కు టికెట్ ఇచ్చారు. దొంగ సర్వేలు చేసి, నర్సాపూర్ టికెట్ రూ.100 కోట్లకు అమ్మేశారని కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్నది. ఇప్పుడు దానిని మేం వందశాతం నమ్ముతున్నాం’ అని ఒక కార్యకర్త మండిపడ్డారు. మరో కార్యకర్త ఏకంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. మరోవైపు గాంధీభవన్లో సమావేశమైన ఎన్ఎస్యూఐ నేతలు టికెట్ల కేటాయింపులో తమకు మొండిచేయి చూపించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్కు టికెట్ ఇవ్వలేదని, వనపర్తిలో శివసేనారెడ్డికి టికెట్ కేటాయిస్తారని భావించామని, కానీ మోసం చేశారని మండిపడ్డారు. అంబర్పేటలో శ్రీకాంత్కు టికెట్ ఇవ్వకపోవడంపై ఎన్ఎస్యూఐ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఫైజల్ ముజ్జు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మూడో తేదీ నాటికి శ్రీకాంత్కు టికెట్ ఇవ్వకపోతే మా గల్లీల్లోకి ఎవరు ప్రచారానికి వచ్చినా రాళ్లతో ఉరికించి కొడతాం. కష్టపడి పనిచేసేవాళ్లందరినీ హౌలేగాళ్లను చేసిన్రు. రేవంత్రెడ్డి, వీహెచ్ ఇండ్లకు వెళ్లి మరీ కొడతాం’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొంపముంచాడంటూ కాంగ్రెస్ నేతలు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్రెడ్డి వ్యవహారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైందని, టికెట్లు అమ్ముకున్నాడన్న ఆరోపణలు, మూడు గంటల విద్యుత్తు చాలు వంటి వ్యాఖ్యలతో ప్రజల్లో ముఖం చూపించుకోలేకపోతున్నామని నేతలు వాపోతున్నారు. ‘అతడి కంటే గొప్పోడు ఆచంట మల్లన్న’ అన్నట్టుగా డీకే శివకుమార్ వచ్చి కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంటే ఇస్తున్నామని చెప్పడంతో ఇజ్జత్ పోయిందని వాపోతున్నారు. వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇస్తున్న రాష్ర్టానికి వచ్చి 5 గంటలు ఇవ్వడాన్ని గొప్పగా చెప్పుకోవడం కన్నా తెలివితక్కువతనం ఏమైనా ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక మాడల్ అంతా వట్టి మోసమేనని బట్టబయలు చేశారని చెప్తున్నారు. డీకే వ్యాఖ్యలను కవర్ చేయలేక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ చేసిన ‘వ్యవసాయానికి 3 గంటల కరంటు చాలు’, ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడిన ‘రైతుబంధు దుబారా’ అన్న కామెంట్లతో ప్రజల్లో కాంగ్రెస్ను రైతు వ్యతిరేకిగా ముద్ర వేశాయని అంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నామని డీకే చెప్పడం మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు అయ్యిందని వాపోతున్నారు. ఏదో చేస్తాడని కర్ణాటక నుంచి నేతలను పట్టుకొచ్చి ప్రచారం చేస్తే.. బూమరాంగ్ అయ్యిందంటూ నెత్తిబాదుకుంటున్నారు. డీకే శివకుమార్ను రాష్ట్రమంతా తిప్పి ప్రచారం చేయించాలనుకున్న కాంగ్రెస్ ప్లాన్ అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఈ పర్యటన ఇలాగే కొనసాగితే మరింత నష్టం ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం తమకు డిపాజిట్లు దక్కాలంటే డీకే శివకుమార్ను ప్రచారానికి పంపొద్దని కోరుతున్నారు. ఈ మేరకు అధిష్ఠానానికి పలువురు నేతలు ఫిర్యాదు చేశారట. సోషల్ మీడియాలోనూ డీకే ప్రచారం వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతుందని, అక్కడ కూడా ఆయన ముఖం చూపెట్టొద్దని కోరుతున్నారట.