సుల్తానాబాద్: అధికారంలోకి రాకముందే రైతు బంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పొరపాటున ఆ పార్టీలు అధికారంలో రైతుబంధును (Rythu Bandhu) మొత్తానికే ఎత్తగొడతారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కొత్త కుట్రకు తెరలెపి రైతుబంధును ఆపేశాయని విమర్శించారు. రైతు బంధు ఇవ్వొద్దని కాగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో చాలామందికి మూడెకరాలోపే భూమి ఉన్నదని, 3 గంటల కరెంటు సరిపోతుందని.. 24 గంటల కరెంట్ ఎందుకని రేవంత్ రెడ్డి అంటున్నాడన్నారు. రైతు బంధు రైతుకిస్తే కౌలుదారుకు ఇవ్వమని, కౌలుదారుకిస్తే రైతుకిచ్చేది లేదని పీసీసీ చీఫ్ ప్రకటించాడని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కొత్తదేమీ కాదని, చెత్తపార్టీ అన్ని విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు అడుగుతున్నారని, ఇప్పటివరకు 11 సార్లు అవకాశం ఇస్తే తాగు నీరు, సాగు నీరివ్వలేదు, కరెంటు, పెన్షన్లు ఇవ్వలే, సంక్షేమం సక్కగ చేయకుండా జీవితాలను ఆగంచేశారని విమర్శించారు. రైతులను ఆగం చేసిందని, మన బతుకులను నాశనం చేసిందని, తెలంగాణను బొందపెట్టే ప్రయత్నం చేసిన పార్టీ, 55 ఏండ్లు మన పిల్లలను సావగొట్టిన పార్టీ, తెలంగాణ ఇవ్వకుండా వందల మంది పిల్లల ప్రాణాలు తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
చావు నోట్లోపెట్టి కేసీఆర్ తెలంగాణను సాధించారని, ప్రజలంతా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా రెండు టర్ములు పనిచేశారని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏం చేశారని మాట్లాడుతున్నారని.. రైతుబంధును ప్రవేశపెట్టిందే కేసీఆర్ అని, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రూ.2 వేల పెన్షన్, ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ ఇచ్చారని చెప్పారు. కరెంటు మంచిగ చేసిన కేసీఆర్.. బతుకులు బాగుచేసిన, రైతును రాజును చేసిన కేసీఆర్ను వద్దని.. 55 ఏండ్లు మనల్ని సావగొట్టిన కాంగ్రెసే ముద్దని కొందరు అంటున్నారని విమర్శించారు.
1956లో ఒక్క తప్పు చేసి 58 ఏండ్లు మనల్ని వెంటాడిందని, మరోసారి అదే తప్పు చేయొద్దన్నారు. పట్వారీలు, దళారీలు మరోసారి కావాల్నా అని ప్రశ్నించారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. కరెంటు కావాలంటే కాంగ్రెస్ ఉండొద్దని, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కరెంటు లేదన్నారు. 24 గంటల కరెంటిచ్చే పార్టీ కావాలో.. మూడుగంటల కరెంటిచ్చే పార్టీ కావాలో ఆలోచించాలన్నారు.
మరోసారి అధికారంలోకి వస్తే ఆడపిల్లల కోసం నెలకు రూ.3 వేల ఇచ్చేలా సౌభాగ్యలక్ష్మి పథకం తీసుకొస్తున్నామని, ఆసరా పెన్షన్లను రూ.5 వేలకు పెంచుతామన్నారు. మోడీ పెంచిన సిలిండర్ ధరను తగ్గిస్తున్నామని రూ.400లకే అందిస్తామని చెప్పారు. అర్హులందరికి కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులను జనవరిలో ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డులున్నవారికి సన్న బియ్యం ఇస్తామన్నారు. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా అన్నారు. అసైండ్ భూములున్న ప్రతిఒక్కరికి పూర్తి యాజమాన్య హక్కు కల్పిస్తామని చెప్పారు. కేసీఆర్ బొండిగ పిసికేస్తే తెలంగాణ గురించే అడిగేవాళ్లు ఉండరనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అగ్రనాయకులు రాష్ట్రంపై దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను ఢిల్లీ చేతుల్లో పెట్టొద్దన్నారు.