జయశంకర్ భూపాల పల్లి : రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్ని రకాలుగా అన్యాయం చేశాయి. గ్రామాలను గత్తర లేపాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాలోని మొగుల్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.5 కోట్ల 3లక్షల చెక్కులను మహిళలకు పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు.
నాటి పాలకులు గ్రామాలను కనీసం పట్టించుకోలేదు. నీళ్లు లేవు, నిధులు లేవు, పనులు లేవు. మొత్తం ప్రజలు, కుల వృత్తులు అగమై, వలస పోయే దుస్థితి కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశౠరు. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు. తెలంగాణలోని పల్లెలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
తెలంగాణకు అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి. కేంద్రమే ఇస్తున్నది. మళ్లా వాళ్లే తెలంగాణలో ఏమీ జరగడం లేదని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చేతగాని వాళ్లు ఏదేదో మాట్లాడుతారు. అవన్నీ పట్టించుకోవద్దన్నారు. ప్రగతిని చూసి ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర్, తదితరులు పాల్గొన్నారు.