నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది. 5 రాష్ర్టాల్లో ఎన్నికల వేళ జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్లు రెండు అరాచక రాజకీయాలు చేస్తున్నాయని, నమస్తే తెలంగాణ బుధవారమే ఒక కథనం ప్రచురించింది. జాతీయ ప్రాధాన్యం ఉన్న జనగణన, బీసీ కులగణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని అందులో పేర్కొన్నది. మహిళల ఓట్ల కోసం.. మహిళా కోటా, నియోజక వర్గాల పునర్విభజన పేరుతో నిన్న బీజేపీ గేమ్ మొదలుపెట్టగా, ఈ రోజు కాంగ్రెస్ దానికి కొనసాగింపు ప్రకటించింది. బీసీ నివేదికను ఇటు మంత్రి పొన్నం చేతుల మీదుగా హడావుడిగా విడుదల చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం జరుగుతున్న రాజకీయానికి ఓ తార్కాణం. మొత్తమ్మీద ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల ప్రయోజనాల కోసం అటు బీజేపీ దక్షిణాదికి అన్యాయం చేస్తుండగా.. కాంగ్రెస్ తెలంగాణలో బీసీలకు వెన్నుపోటు పొడించింది. ఇదీ రెండు జాతీయ పార్టీల ‘డైవర్షన్’ దోబూచులాట!
కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో అప్పుడెప్పుడో ఏడాదిన్నర క్రితం చేసిన అరకొర బీసీ కులగణన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర సర్కార్ ఎంత హడావుడిగా ఆషామాషీగా రాజ్యాంగ సవరణ తలకెత్తుకున్నదో, తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే అధ్వానంగా అర్ధరాత్రి బీసీ కులగణన గణాంకాలను వెల్లడించింది.
ఇంకా దారుణమేమిటంటే తెలంగాణ బడుగుబలహీన వర్గాల్లో మిగతా అన్ని ఉప కులాలకన్నా ముస్లింలే అత్యధికంగా ఉన్నారని ప్రకటించడం! అసలు ముస్లింలను బీసీలుగా పరిగణించడాన్నే బడుగులు వ్యతిరేకిస్తుంటే.. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏకంగా అధికసంఖ్యాక బడుగులు ముస్లింలేనని ప్రకటించడం మరింత విడ్డూరం. గౌడన్నలు, నేతన్నలు, ముదిరాజన్నలు, గొల్లకురుమలు, మున్నురుకాపులు తదితర సబ్బండ వర్గాలు తెలంగాణలో బలహీన వర్ణాలు గొంతుకలై ప్రతిధ్వనిస్తూ తమ అస్తిత్వంకోసం, రాజకీయాల్లో తమ వాటా కోసం దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుంటే.. వారందరిపై పిడుగుపాటుగా, శరాఘాతంలా.. తెలంగాణలో అత్యధికసంఖ్యలో ఉన్న బీసీ వర్గం ముస్లింలేనని రేవంత్ సర్కార్ చిమ్మ చీకటిలో ప్రకటించడం ప్రభుత్వ గుడ్డితనానికి నిదర్శనం.
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన అసలేమాత్రం సజావుగా సాగలేదని, ప్రతి దశలోనూ ఇది లోపభూయిష్టంగానే జరిగిందని సర్వే సమయంలోనే అనేక ఆరోపణలు, అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అవన్నీ అక్షరాలా నిజమేనని సర్వే గణాంకాలు ఇప్పుడు స్పష్టంగా నిరూపించాయి. ఇదిట్లా ఉంటే బీసీ కులగణన గణాంకాలను వెల్లడించిన సమయ సందర్భాలు తీవ్ర అనుమానాస్పదంగా ఉన్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు రేపటి నుంచి మొదలవుతుండటం, సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి చేరిక సందర్భంగా ఈ నెల 20న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన తరుణంలో రేవంత్ ప్రభుత్వం బీసీ కులగణనను బయటపెట్టడం అతి భారీ డైవర్షన్ ఎత్తుగడగా కనిపిస్తున్నది.
డైవర్షన్ సంగతేమోగాని ఈ అసమగ్ర నివేదికతో కొలిమి అంటుకున్నట్టే!
ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేసుకుని పూర్తి పారదర్శకంగా కులగణన చేపట్టాం. బీహార్, కర్ణాటక సహా పలు రాష్ర్టాల్లో అధ్యయనం చేసిన తర్వాతే సర్వే నిర్వహించాం. మూడు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి డేటా సేకరించాం. 15 ప్రభుత్వ శాఖల అధికారులను ఇందులో భాగస్వామ్యం చేశాం. మొత్తం 8 పేజీలతో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారం ఆధారంగా సర్వే పూర్తి చేశాం. అదనంగా 36,000 మంది డాటా ఆపరేటర్లను నియమించాం. ఎన్రోలర్లు సేకరించిన డేటానే కంప్యూటర్లో నమోదు చేశారు. మొత్తం 1.12 కోట్ల కుటుంబాలు కులగణన సర్వేలో పాల్గొన్నాయి..
– ఫిబ్రవరి 4, 2025న అసెంబ్లీలో సీఎం రేవంత్
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా బీసీ ‘ఈ’ క్యాటగిరీలోని షేక్లే అగ్రస్థానంలో నిలిచారు. బీసీల మొత్తం జనాభాలో షేక్లు 27,95,727 మంది (7.9%) ఉన్నారు. ఆ తరువాత ముదిరాజ్ జనాభా అత్యధికంగా ఉన్నది. ఈ మేరకు గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం గత నవంబర్లో రాష్ట్రంలో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే- 2024) నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 1,12,36,849 కుటుంబాలను (97.10%) సర్వే చేసింది. మొత్తం 3,55,50,759 జనాభా వివరాలు సేకరించింది. ఆ సర్వే గణాంకాల విశ్లేషణ కోసం జస్టిస్ సుదర్శన్రెడ్డి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక గణాంకాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో బుధవారం విడుదల చేశారు. అంతేకాదు, ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే డాటాను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో మైనారిటీ బీసీలు కలుపుకొని మొత్తంగా బీసీలు 46.25%, ముస్లిం బీసీలు 10.08%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%, నో క్యాస్ట్ 4%మంది ఉన్నారని వెల్లడించారు. సర్వే వివరాలు WWW.des.telangana.gov.in లో ఉన్నాయని తెలిపారు. బీసీల్లో షేక్లు 7.9%, ముదిరాజ్ 7.4%, యాదవ 5.7%, గౌడ్ 4.6%, మున్నూరుకాపు 3.9% ఉన్నట్టు తేల్చింది. ఎస్సీ జనాభాలో మాదిగలు 10.3%, మాలలు 4.1% ఉన్నట్టు వెల్లడించింది. ఎస్టీల్లో అత్యధికంగా లంబాడీ/సుగాలి అత్యధికంగా 6.8% ఉన్నట్టు పేర్కొన్నది. ఓసీల్లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం 4.8% ఉండగా, ఆ తరువాతి స్థానంలో ఓసీ ముస్లీంలు 1.8% ఉన్నారు. వైశ్యులు 1.4%, కమ్మ 1%, బ్రాహ్మణులు 0.9%, కాపులు 0.7%, వెలమలు 0.4% ఉన్నట్టు వెల్లడించింది.

రాష్ట్రంలో మొత్తం కులాలు 242 ఉన్నట్టు ప్రభుత్వం లెక్క తేల్చింది. బీసీ క్యాటగిరీలో మొత్తం 133 కులాలు ఉండగా, ఇందులో 69 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని, 64 కులాల్లో తక్కువ వెనుకబాటు తనం ఉన్నదని తేల్చింది. ఎస్సీ క్యాటగిరీలో 59 కులాలు ఉండగా ఇందులో 41 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నట్టు పేర్కొన్నది. ఎస్టీల్లో 32 కులాలు ఉండగా 25 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని తెలిపింది. ఓసీ క్యాటగిరీలో మొత్తం 18 కులాలు ఉండగా, అందులో ఒక్క కులం కూడా అత్యంత వెనుకబడిన క్యాటగిరీలో లేకపోవడం గమనార్హం.
ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా వెనుకబడి ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఉన్నారు. బీసీల్లో అత్యధికంగా లబ్ధిపొందుతున్నది కేవలం ఐదు కులాలేనని నివేదిక తేల్చింది. ముదిరాజ్, యాదవ, మున్నూరుకాపులు జనాభాతోపాటుగా రాజకీయంగా బలంగా ఉన్నట్టు తెలిపింది. బీసీ ఈ క్యాటగిరీలో షేక్లు అత్యధికంగా ఉన్నారని వివరించింది. గౌడ, పద్మశాలీ, కురుమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలమైన స్థానాన్ని కలి గి ఉన్నారని నివేదించింది. మొత్తం గా షేక్, ముదిరాజ్, యాదవ, గౌడ్, మున్నూరుకాపులో బీసీ జనాభాలో 30% ఉన్నారని తేల్చింది.
