మేడ్చల్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. తాజాగా శుక్రవారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడీ మలక్పేటలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ నేతలపై దౌర్జన్యం చేయగా, ఈ ఘటనలో బీఆర్ఎస్ దళిత నేత ఢిల్లీ పరమేశ్, మరో నేత శివకుమార్ గాయపడ్డారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయి ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డిలపైనా దాడికి యత్నించగా, వారి గన్మెన్లు, బీఆర్ఎస్ శ్రేణులు నిలువరించారు. అంతటితో ఆగకుండా మల్లారెడ్డి వాహనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
లాల్గడి మలక్పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి వనజా శ్రీనివాస్రెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ శ్రేణులతో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి సమావేశమయ్యారు. అక్కడి కాంగ్రెస్ నాయకులు చేరుకొని కావాలనే ఆ ఇంటి ఎదుట డీజే సౌండ్ పెట్టి ఇబ్బందులు పడేలా చేశారు. సౌండ్ను చిన్నగా చేయాలని లేదా ఇక్కడి నుంచి పక్కన పెట్టుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా మరింత సౌండ్ పెంచి డీజే వాహనానికి తాళం వేశారు. అనంతరం శ్రీనివాస్రెడ్డి ఇంటి వద్దకు కాంగ్రెస్ శ్రేణులను ఉసిగొల్పడంతో వారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై రెచ్చిపోయి కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లతో దాడికి పాల్పడారు. దాడికి తెగబడ్డ కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ఢిల్లీ పరమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ సీహెచ్ శంకర్రెడ్డి, సీఐ గురవయ్య వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

పోలీస్స్టేషన్ ఎదుట నిరసన
బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని జీనోమ్వ్యాలీ పోలీస్స్టేషన్ ఎదుట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు గజ్జెల నాగేశ్లు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించారు. వందలాది సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్స్టేషన్కు చేరుకుని ధర్నాకు దిగారు. కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్, మరికొంత మంది కాంగ్రెస్ నాయకులపై మల్లారెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మమ్మల్ని సంపెటోళ్లు: ఎమ్మెల్యే మల్లారెడ్డి
గన్మెన్లు, బీఆర్ఎస్ శ్రేణులు లేకుంటే కాంగ్రెసోళ్లు మమ్మల్లి సంపెటోళ్లని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. గన్మెన్లు దర్వాజలను బంద్ చేసి తమకు కాపలా ఉన్నారని, కాంగ్రెస్ ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల వద్దకు పోయే ముఖం లేక తమపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఇలాంటి ద్యౌర్జనాలు చేస్తున్నదన్నారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోపోతే జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ప్రణాళిక రూపొందించి ఉద్యమిస్తామని మల్లారెడ్డి హెచ్చరించారు.