తిమ్మాపూర్, అక్టోబర్ 27: కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. గూండాగిరి చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. గురువారం అర్ధరాత్రి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంపు ఆఫీస్పై దాడికి దిగారు. ఎమ్మెల్యే గన్మెన్లపై, డ్రైవర్లపై నానా దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రమణారెడ్డి, ఇటీవల కాంగ్రెస్లో చేరిన గోగూరి నర్సింహారెడ్డి, పోలంపల్లి ఎంపీటీసీ రమేశ్, ఇంకా ముగ్గురు నేతలు గురువారం రాత్రి 11 గంటల సమయంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లోకి వెళ్లి రౌడీల అవతారెమెత్తారు. ‘ఎలక్షన్ కోడ్ ఉండగా.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎలా ఉంటారు’ అంటూ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. కుర్చీలు, డస్ట్ బిన్లను పడేశారు. స్రమా చారం మేరకు పోలీసులు వచ్చి కాంగ్రెస్ నాయకులను పోలీస్స్టేషన్కు తరలించారు.కాగా, “మీ లాగా మేం రౌడీయిజం చేస్తే తట్టుకోలేరు’ అని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు హెచ్చరించారు. అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యే అధికారిక నివాసంపై దాడికి దిగడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.