BRS Party | కారేపల్లి (కామేపల్లి) ఏప్రిల్ 9: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకున్నది. జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కొమ్మినేపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు చల్లా హరి కుటుంబం, పలువురు కార్యకర్తల ఇండ్లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పండితాపురంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఎడ్లబండిపై ప్రభల ఊరేగింపు జరుగుతున్నది. ఆ సమయంలో బీఆర్ఎస్ కొమ్మినేపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు చల్లా హరి తన కుమారుడు జానీతోపాటు సోదరుడి కుమార్తె బ్యూలాను బైక్పై ఎక్కించుకొని ఇంటికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఓ మంత్రి అనుచరుడిగా చెప్పుకునే మేకపోతుల మహేశ్గౌడ్ సహా మరికొంతమంది కలిసి చల్లా హరిపై దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకున్న పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కామేపల్లి మండల అధ్యక్షుడు దనియాకుల హన్మంతరావు.. తన కారులో కొమ్మినేపల్లిలోని చల్లా హరి ఇంటికి వెళ్లగా.. కాంగ్రెస్ గూండాలు హన్మంతరావు కారు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లపైనా దాడి చేసి పలువురిని గాయపర్చారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గ్రామంలో 144 సెక్షన్ విధించినట్టు ఏసీపీ తెలిపారు.