హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ)/చండూరు/మోర్తాడ్: మోసకారి పార్టీ కాంగ్రెస్, ద్రోహపూరిత పార్టీ బీజేపీ అని రాష్ట్రంలో, దేశంలో ప్రజలు తీర్మానించుకొన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో స్థానం లేదని తేల్చిచెప్పారు. నల్లగొండ జిల్లాలో గట్టుప్పల కొత్త మండలంగా ఏర్పాటైన నేపథ్యంలో గట్టుప్పల మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం, ఆయా పార్టీలకు చెందిన 200కుపైగా నాయకులు, కార్యకర్తలు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. మోసకారి పార్టీగా ప్రజల్లో కాంగ్రెస్కు గుర్తింపు వచ్చిందని, మోదీ పన్నుల ప్రధానిగా ఘనత కెకారని ఎద్దేవాచేశారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహించే సూర్యాపేట నియోజకవర్గం తరహాలో మునుగోడు అభివృద్ధికి అన్నివిధాలుగా తోడ్పాటును అందిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలతోపాటు పెరిగి మునుగోడును కబళించిన ఫ్లోరోసిస్ను నివారించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కీర్తించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి వ్యాపకాలు, వ్యాపారాలు ఎక్కువ కావడం వల్ల తన నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని తన నివాసంలో సోమవారం గట్టుప్పల్ మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసానికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి. చిత్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి తదితరులు
మోర్తాడ్ మాజీ సర్పంచ్ అజీస్ సహా 500 మంది చేరిక
బీజేపీ, కాంగ్రెస్లతో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వీరంతా రాజకీయ మిడతల దండులా తెలంగాణ మీద పడ్డారని విమర్శించారు. మన రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేదని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మోర్తాడ్ మాజీ సర్పంచ్ అజీస్ సోమవారం 500 మంది అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మోర్తాడ్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణ మీద కక్షగట్టిందని, పచ్చగా ఉన్న తెలంగాణను ఆగం చేయాలని చూస్తుందని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వాన్ని యావత్దేశం కోరుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా, సర్పంచ్ ధరణి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత సమక్షంలో చేరిక
ఖలీల్వాడి, జూలై 24: నిజామాబాద్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, 23వ డివిజన్ కార్పొరేటర్ మల్లేశ్ యాదవ్ సోమవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్సీ కవిత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్రావు తదితరులు పాల్గొన్నారు.