Minister Dayakar Rao | నేటి ధరల పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 53, 54వ డివిజన్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. సొంత స్థలాలు ఉన్న వారికి ఇండ్లు కట్టుకోవడానికి ‘గృహలక్ష్మి’ పథకం కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని లేదన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలను.. ఇక్కడ అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాంటి వాళ్లవల్లే ఇవాళ అన్నిరకాల ధరలు పెరిగాయని మండిపడ్డారు. విభజన హామీలు కూడా నెరవేర్చని వారు విచిత్రంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే పార్టీ శ్రేణులు అలాంటి వాదనలను తిప్పి కొట్టాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్లాంటి పార్టీ దేశంలోనే లేదన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఏ కారణం చేతనైనా కార్యకర్త చనిపోతే, రూ.2లక్షల చెక్కును అందచేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. 80లక్షల సైనికులుగా గల కార్యకర్తలు, మంచి సమర్థవంతమైన, అనుభవంగల, యువ నాయకత్వం మన బలమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. మంత్రి ఎర్రబెల్లి నాయకత్వంలో పల్లెలు బాగుపడ్డాయని, అవార్డులు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.