హైదరాబాద్ : దేశమంతటా నేడు కరెంటు కటకట ఉందని, సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ను ఇస్తున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రధాని సొంతరాష్ట్రమైన గుజరాత్లో కరెంటు లేదని గుర్తు చేశారు. గురువారం బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నుంచి 300 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి గులాబీ కండులాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులపై టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి స్వాగతం పలికారు.
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి అందరి కండ్లకు కనిపిస్తుందన్నారు. కేసీఆర్ దయతో రూ.100కోట్లతో చెక్డ్యాములు నిర్మించానన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా సాగునీటికి గోసలేకుండా చేశారన్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అదానీ, అంబానీకి అమ్ముతున్నరని దుయ్యబట్టారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిందని, బాగా మాట్లాడుతున్న బండి సంజయ్, అరవింద్ దమ్ముంటే జాతీయ హోదా తెప్పించి రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు వచ్చే పరిశ్రమలు గుజరాత్కు తరలించుకు పోతుంటే నలుగురు బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పాలమూరుకు నీళ్లు రాకుండా కృష్ణ జలాల్లో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇలా అన్నిట్లో తెలంగాణ మీద కేంద్రం అన్నిట్లో వివక్ష చూపుతోందిని విమర్శించారు. బండి సంజయ్ ఇవాళ ఏం వారం, రేపు ఏం వారం అని తిరుగుతున్నాడని, కానీ ఆయనకు అభివృద్ధి గురించి ఏమాత్రం అక్కర్లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే తెలంగాణ ఎంపీగా ఎట్లా ఉండగలుగుతున్నారని మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఏమన్నా అంటే జై శ్రీరామ్ మాటలు చెప్తాడు తప్పా.. ఒక్క గుడి కట్టించింది లేదన్నారు. తాను కేసిఆర్ను ఒప్పించి ఒక్క బాల్కొండలోనే 50 గుడులు కట్టించానని చెప్పారు.
ఇటీవల గ్రూపు వన్ ఉద్యోగాలపై అనవసర విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కూడా ఉర్దూ ఉంటుందని, యూపీఎస్సీలో ఉర్దూ ఉంటుందన్నారు. అంత మాత్రాన దేశం అంతా ముస్లిం కలెక్టర్లు ఉన్నారా? అని నిలదీశారు. అరవింద్, బండి సంజయ్వి కేవలం అవగాహన రహిత, రెచ్చగొట్టే మాటలే అన్నారు. ఏపీలో వ్యవసాయ కరెంట్ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని గుర్తు చేశారు. స్వయంగా ఏపీ మంత్రి ఆరు నెలల్లో మోటార్లు పెట్టడం పూర్తి చేస్తామని అధికారికంగా ప్రకటించారన్నారు. అందుకు కేంద్రం రూ.5వేల కోట్ల రుణపరిమితి ఆశ చూపిందని, తెలంగాణలో బిగించేందుకు సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని గుర్తు చేశారు.