హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రోజుకోచోట బీజేపీ, కాంగ్రెస్కు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు సహా ఆయా పార్టీల అనుబంధ సంఘాల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాష్ట్ర ప్రగతిని అడ్డుకొనేవిధంగా వ్యవహరిస్తున్నదని, దీంతోపాటు రాష్ట్రంలోని బీజేపీ నేతలు వారి ప్రాపకం కోసమే వ్యహహరిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రగతిని పట్టించుకోవటంలేదని ఆ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు రోజుకో మాట..పూటకో చర్య అన్నట్టు వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు టీఆర్ఎస్లో చేరుతున్నారు.
తాజాగా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తమను పట్టించుకోవటం లేదని, తమ కంటే తన వ్యాపారాలే ముఖ్యమని ఆయన భావిస్తుండటం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నామని ఆది, సోమవారాల్లో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో చేరిన స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే ఒకరోజు ముందు నుంచే రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు టీఆర్ఎస్లోకి వెల్లువలా వచ్చి చేరుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు. తరాల తరబడి కాంగ్రెస్తో అనుబంధమున్న కుటుంబాలకు కుటుంబాలే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు నచ్చి..మెచ్చి టీఆర్ఎస్లో చేరుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ మినహా మరోపార్టీకి అవకాశం లేదని, టీఆర్ఎస్ ప్రజాబలం ముందు మరే పార్టీ నిలవలేదని గ్రహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు.. మండల, జిల్లా స్థాయి నాయకులు వరుసబెట్టి టీఆర్ఎస్లో చేరుతున్నారు. ప్రజలు టీఆర్ఎస్తో ఉంటే తాము అనామకులుగా కాంగ్రెస్ పార్టీలోనో.. బీజేపీలోనే ఉంటే లాభం లేదని నిశ్చయించుకున్న ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులను, ఎమ్మెల్యేలను కాంగ్రెస్, బీజేపీ నేతలు వారి వారి స్థాయిని మరచి.. హోదాను మరిచి వ్యక్తిగతంగా విమర్శలు చేయటం మంచిది కాదని తామెన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయా పార్టీల నేతలు పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో టీఆర్ఎస్లో చేరికలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో గతనెలలో జీహెచ్ఎంసీ నుంచి నలుగురు బీజేపీ కార్పొరేటర్లు బానోతు సుజాతానాయక్, అర్చనా ప్రకాశ్, వెంకటేశ్, సునీతా ప్రకాశ్గౌడ్తోపాటు తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్లీడర్ సింధూజాగౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్, కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఏడుగురు కౌన్సిలర్లు గులాబీ కండువాలు కప్పుకొన్నారు. ఆ తెల్లారే వరంగల్ మున్సిపాల్ కార్పొరేషన్కు చెందిన బీజేపీ కార్పొరేటర్ చింతాకుల అనిల్తోపాటు రైల్వే యూజర్ కమిటీ సభ్యుడు చింతాకుల సునీల్ మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్కు చెందిన బీజేపీ కౌన్సిలర్ నెమలికొండ కరుణ సైతం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు అందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరటం గమనార్హం.