హైదరాబాద్, ఆగస్టు 12, (నమస్తే తెలంగాణ): విపక్ష పార్టీలకు మునుగోడు జ్వరం పట్టుకొన్నది. సర్వే నివేదికలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో మునుగోడులో తాము ‘మునుగు’డేనని భయపడుతున్నాయి. కనీసం రెండో స్థానంలోనైనా నిలిచి పరువు నిలుపుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నాయి. ఈ ఉప ఎన్నిక నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ కాంగ్రెస్, బీజేపీ ఆత్మరక్షణలో పడ్డాయి. ప్రస్తుతం పార్టీకి ఏ మాత్రం అనుకూలంగా లేకపోవటంతో కనీసం గౌరవప్రదమైన పోటీ అయినా ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అయితే, మునుగోడు ఉపఎన్నికపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేతులు ఎత్తేసినట్టు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది. అటు బీజేపీ కూడా రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటి నుంచీ వామపక్షాలకు పట్టు ఉండటం, బీజేపీకి పునాదులే లేకపోవటం దృష్ట్యా రెండో స్థానం అనేది అత్యాశే అవుతుందని సర్వే నివేదికలు తేల్చటంతో ఉప ఎన్నికను ఎలా ఎదుర్కోవాలా? అని బీజేపీ నాయకత్వం ఆందోళన పడుతున్నది. మునుగోడు ఎలాగూ సిట్టింగ్ సీటు కానప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని పార్టీలోని ఒక వర్గం వాదిస్తున్నది.
కాంగ్రెస్లో ఈ వాదన మరోలా వినిపిస్తున్నది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నప్పుడు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకం అవుతుంది తప్ప తమకెలా అవుతుందని వాదిస్తున్నారు. కాగా, చండూరు సభపై సమాచారం ఇవ్వకపోవటం, ఉప ఎన్నికపై గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆహ్వానించకపోవటంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయనే మీడియాకు వెల్లడించారు. హుజూరాబాద్లో బీజేపీ గెలిచినా ఫర్వాలేదన్న ఉదాసీనతను మునుగోడులో ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందని, ఒకవేళ బీజేపీ రెండో స్థానంలో నిలిస్తే పార్టీ వలసలను ఆపడం కష్టమన్న భయం కాంగ్రెస్కు పట్టుకుంది. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచినా ఫర్వాలేదు కానీ రెండో స్థానంలో బీజేపీని నిలువరించే వ్యూహంతో పనిచేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అటు.. మునుగోడు ఉపఎన్నికలో పార్టీకి జరిగే నష్టాన్ని ఏ మేరకు తగ్గించుకోగలమని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నది. ఉపఎన్నిక జరిగేనాటికైనా కొంత బలపడేలా వ్యూహరచన చేస్తున్నది. సంస్థాగత వ్యవహారాలు చూడటానికి ప్రత్యేకంగా సునీల్ బన్సాల్ను ఇన్చార్జిగా నియమించింది. ముందస్తు ఎన్నికలకు సై అంటూ ఇంతకాలం కాలు దువ్విన కాంగ్రెస్, బీజేపీని ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక భయపెడుతున్నది.
నిన్నమొన్న వచ్చి తమాషా చేస్తున్నడా..?
హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : ‘నిన్నమొన్న పార్టీలోకి వచ్చి తమాషా చేస్తున్నడా…?’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకుంటే మంచిదని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. తనను పార్టీలోంచి వెళ్లగొట్టేందుకు రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చండూరు సభలో రేవంత్రెడ్డి ఆయన అనుచరులతో కావాలనే తనను తిట్టించారని అన్నారు. అందుకు రేవంత్రెడ్డే స్వయంగా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారు ఆశిస్తున్నట్లుగా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే నాలుగు పార్టీలు మారినవారు ఐదో పార్టీలోకీ వెళ్తారని.. తానుమాత్రం కాంగ్రెస్ను వీడబోనని పరోక్షంగా రేవంత్రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికలకు ముందే రేవంత్రెడ్డి చేతులెత్తేశారని తెలిపారు. రేవంత్రెడ్డి వ్యవహారంపై సోనియా, రాహుల్ వద్దే తేల్చుకుంటానని స్పష్టంచేశారు.
మునుగోడులో బీజేపీ ఓటమే లక్ష్యం
సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి
రామగిరి, ఆగస్టు 12: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిందని, ఐదు పర్యాయాలు సీపీఐ గెలుచుకున్నదని చెప్పారు. 2018లో కాంగ్రెస్కు సీపీఐ మద్దతు ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరుతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.