హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం గురుకులాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులతో బుధవారం సక్సెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో నిర్వహించి కార్యక్రమానికి మంత్రి కొప్పుల హాజరై ప్రసంగించారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో ఛిన్నాభిన్నమైన విద్యారంగాన్ని విప్లవాత్మక నిర్ణయాలతో సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 298 గు రుకులాలు ఉండగా.. వాటి సంఖ్య 1030కి పెంచారని వివరించారు. అనంతరం పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన 90 మంది విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల కమిషనర్ క్రిస్టినా చొంగ్తూ తదితరులు పాల్గొన్నారు.