హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ ప్రారంభించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆశ కార్యకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. సీఎం కేసీఆర్ వారి శ్రమను గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. వారి మనసెరిగి.. వారి ఆశలను గుర్తించి.. అడుగకుండానే నెరవేర్చుతున్నారు. గత ఎనిమిదేండ్లలో వారి పారితోషికం దాదాపు ఆరున్నర రెట్లు పెరుగడమే ఇందుకు ఉదాహరణ. రాష్ట్రంలో ప్రస్తుతం 26,649 మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరు మరింత సమర్థంగా, స్మార్ట్గా విధులు నిర్వహించేలా ఆశ కార్యకర్తలందరికీ ఫోన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం కామారెడ్డి జిల్లాలో ప్రారంభించారు. ప్రస్తుతం ఆశ కార్యకర్తలు సేకరించిన వివరాలను లిఖిత పూర్వకంగా నమోదు చేస్తుండగా.. ఇకపై ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నారు.
ఆశ కార్యకర్తల కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ ఇప్పటివరకు వారి పారితోషికాన్ని మూడుసార్లు పెంచారు. 2017 మే 7న సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఆశ కార్యకర్తలతో జరిపిన సమావేశంలో వారు తమ వేతనాన్ని రూ.1500 నుంచి రూ.4 వేలకు పెంచాలని విన్నవించారు. సీఎం కేసీఆర్ అది సరిపోదని.. ఏకంగా నాలుగు రెట్లు పెంచుతూ రూ.6 వేల పారితోషికం ప్రకటించారు. ఆ తర్వాత వారు అడుగకున్నా మరో రెండుసార్లు పెంచారు. తాజా పెంపుతో ప్రభుత్వం ప్రతినెలా రూ.72 కోట్ల అదనంగా ఖర్చుచేయనున్నది. పారితోషికాల రూపంలో ప్రభుత్వం ప్రతినెలా రూ.312 కోట్లను చెల్లిస్తున్నది. ఏటా దాదాపు రూ.3,750 కోట్లు కేటాయిస్తున్నది.
దేశంలోనే ఆశ కార్యకర్తలకు ఎక్కువ పారితోషికం చెల్లిస్తున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. ముఖ్యంగా అనేక బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా తెలంగాణలో రెండుమూడు రెట్లు అదనంగా పారితోషికం అందుకుంటున్నారు. గుజరాత్లో రూ.4 వేలు ఇస్తుండగా మధ్యప్రదేశ్లో రూ.3 వేలు చెల్లిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో గతేడాది వరకు రూ.2,750 మాత్రమే ఇచ్చేవారు. ఎన్నికల నేపథ్యంలో రూ.5 వేలకు పెంచారు.
ఆశ కార్యకర్తలుగా గ్రామస్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పాలు పంచుకుంటున్నందుకు గర్వంగా ఉన్నది. అప్పుడే పుట్టిన పిల్లలు మొదలు.. అన్ని వయసులవారికి సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం అప్పజెప్పిన ప్రతి పనిని విజయవంతం చేస్తున్నాం. సీఎం కేసీఆర్ మా శ్రమను గుర్తించి మాకు ఎప్పటికప్పుడు పారితోషికం పెంచుతున్నారు. దీంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాం.
– బాకి నవనీత, ఆశ కార్యకర్త, దుద్దెడ, సిద్దిపేట
సీఎం కేసీఆర్ మొదటి నుంచీ మా పనికి తగిన గుర్తింపు ఇస్తున్నారు. ఎనిమిదేండ్లలో మా పారితోషికం ఆరున్నర రెట్లు పెంచారు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. ఇకపై స్మార్ట్గా పనిచేసే అవకాశం కలిగింది. గర్భిణులు వివరాలు, పోషకాహారం, వ్యాక్సిన్లు, ఎన్సీడీ స్క్రీనింగ్ వంటి సమాచారం జాప్యం జరుగకుండా చేరవేసే అవకాశం ఉంటుంది.
– మంజుల, ఆశ కార్యకర్త, కామారెడ్డి