హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీలో సెక్రటరీ జారీచేసిన మార్గదర్శకాలకు దిక్కులేకుండా పోయింది. కిందిస్థాయి ఉద్యోగులే ఇన్చార్జి ప్రిన్సిపాల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమాత్యుడున్నా లేనట్టుగా పరిస్థితి తయారైందని, ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్నవారే లేరని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కాలేజీల్లో మొత్తం 150 ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల్లో వర్కింగ్ ఆరేంజ్మెంట్ కోసం ఇన్చార్జి ప్రిన్సిపాల్స్ను నియమించాలని సూచిస్తూ ఇటీవల సెక్రటరీ సర్క్యులర్ జారీచేశారు. ఆయా గురుకులంలో సీనియర్ జేఎల్, పీజీటీ, టీజీటీను ఇన్చార్జి ప్రిన్సిపాల్గా నియమించాలని నిబంధన విధించారు. వారు సుముఖంగా లేకపోతే, రాతపూర్వక అంగీకారం తీసుకొని, సీనియర్కు బాధ్యత ఇవ్వాలని స్పష్టంచేశారు.
గురుకుల సెక్రటరీ జారీచేసిన సర్క్యులర్కు విరుద్ధంగా జోనల్ ఆఫీసర్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్స్ను నియమిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 50 పోస్టుల్లో సీనియర్ల నుంచి అంగీకార పత్రాలను తీసుకోకుండానే జూనియర్లకు, అదీ సీనియార్టీ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న వాళ్లకు ప్రిన్సిపాల్ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తున్నది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. చేర్యాల, బెల్లంపల్లి, మధిర, తిరుమలాయపాలెం ఇలా దాదాపు 50 చోట్ల జోనల్ ఆఫీసర్లు నిబంధనలకు పాతరేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జోనల్ ఆఫీసర్ల తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, పేరెంట్స్ కమిటీలు మండిపడుతున్నాయి. సెక్రటరీ ఉత్తర్వులను అటకెకించడం వెనుక ప్రధాన కార్యాలయంలోని పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెడ్ఆఫీస్లోని పలువురు అధికారుల అక్రమాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, అనేకమార్లు ఫిర్యాదు చేసినా అమాత్యుడు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని, సర్యులర్ అమలయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.