Mahalakshmi Scheme | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు తెస్తున్నది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ఓ వైపు గొప్పలు చెప్పుకొంటూనే.. మరోవైపు ఆదాయం రావట్లేదంటూ కండక్టర్లపై ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవడం పట్ల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఫ్రీ టికెట్లు ఎక్కువగా ఎందుకు ఇష్యూ చేస్తున్నారని అధికారులు అడుగుతుండటంతో కండక్టర్లు గందరగోళానికి గురవుతున్నారు. నగరంలోని మియాపూర్-బాచుపల్లి- ఓఆర్ఆర్ 195 రూట్లో ఎక్కువగా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినులు బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. దీంతో ఈ రూట్ బస్సుల్లో కలెక్షన్లు తగ్గాయి. ఈ నెల 24న మియాపూర్ డిపోకు చెందిన ఓ బస్సు కండక్టర్ 190 మంది ప్రయాణికులకు టికెట్లు జారీ చేశాడు.
వీటిలో 140 ఫ్రీ టికెట్లు, 50 కలెక్షన్ టికెట్లు ఉన్నాయి. అయితే బస్సుల్లో ఫ్రీ టికెట్లు ఎక్కువగా ఎందుకు కొట్టావ్? కావాలనే ఫ్రీ టికెట్లు కొట్టి.. కలెక్షన్లు తక్కువ తెస్తున్నావంటూ సదరు డిపో మేనేజర్ కండక్టర్పై చర్యలు తీసుకున్నాడు. ఆ కండక్టర్కు మరుసటి రోజు డ్యూటీ ఇవ్వకుండా నిలిపివేశాడు. విషయం తెలుసుకుందామని శుక్రవారం వెళితే.. అధికారులెవరూ డ్యూటీలో లేరు. గతంలోనూ కలెక్షన్ తక్కువ తెస్తున్నారంటూ.. కండక్టర్ల పేరుతో డిపో, బస్టాండుల్లో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అప్పట్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో ఫ్లెక్సీలను తీసివేశారు. ప్రభుత్వమే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తూ, ప్రయాణికుల చార్జీలను రీయింబర్స్మెంట్ చేస్తుంటే డిపోమేనేజర్లు డ్రైవర్లు, కండక్టర్లపై చర్యలు తీసుకోవడం పట్ల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.