బయ్యారం/నిర్మల్ అర్బన్, మార్చి 11: ‘గృహజ్యోతి’ లబ్ధి కోసం వివరాలను ఆన్లైన్ చేసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద భారీగా క్యూలో నిల్చున్నారు. గత నెల 27 నుంచి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా.. మండలంలోని చాలా మంది పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో చాలా మందికి అర్హత లభించక గందరగోళం నెలకొంది.
ప్రజాపాలనలో 29 జీపీలకు 15,776 మంది దరఖాస్తు చేసుకుంటే, కేవలం 5,954 మంది మాత్రమే 200 యూనిట్ల ఉచిత కరంట్ (జీరో బిల్)కు అర్హులుగా విద్యుత్తు శాఖకు జాబితా అందింది. విద్యుత్తు సిబ్బంది కరెంట్ బిల్లులు ఇస్తున్న క్రమంలో తమకు గృహజ్యోతి పథకం వర్తించలేదని ప్రజలు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు ఉండి గృహజ్యోతి పథకంలో అర్హత పొందని వారు ఆధార్కార్డు, విద్యుత్తు బిల్లు వివరాలను మళ్లీ ఆన్లైన్ చేసుకోవాలని సూచించింది. దీంతో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద బారులు తీరారు.
‘గృహజ్యోతి’ కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఇస్తామని చెప్పడంతో అందరూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. కొందరికే జీరో బిల్లులు వచ్చాయి. చాలా మంది జీరో బిల్లుకు అనర్హులయ్యారు. కాంగ్రెస్ సర్కారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించడంతో.. నాలుగు రోజులుగా మున్సిపాలిటీల్లో జీరో బిల్లు రానివారు దరఖాస్తు చేసుకుంటున్నారు.