భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరైన వీ రామ్గోపాల్రావు.. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం.. ముఖ్యంగా నానో ఎలక్ట్రానిక్స్పై వందలాది పరిశోధన వ్యాసాలు రాశారు. ఆయన పేరుతో 49 పేటెంట్లు ఉండటం విశేషం. పాలమూరు జిల్లా కొల్లాపూర్కు చెందిన రాంగోపాల్రావు రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంపై చేసిన సునిశిత విశ్లేషణ..
అమ్మభాష అవసరమే
ఇంగ్లిష్కు డిమాండ్ ఉన్నదని అమ్మభాషను నిర్లక్ష్యం చేయరాదు. ఇంగ్లిష్ మీడియంతో పాటు హిందీ, మాతృభాషను పిల్లలకు నేర్పించాలి. తెలుగు భాషా మాధుర్యాన్ని, తరతరాలుగా వారసత్వంగా లభించిన తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవాలి. ఇంగ్లిష్ మీడియం చదువులతో పాటు తెలుగును రెండోభాషగా అమలుపర్చాలి. సహజంగానే మనవారు త్రిభాషా సూత్రాన్ని ఒంటబట్టించుకుని, ఏదేని మూడు భాషలను నేర్చుకొంటున్నారు. ఇది మనకు సానుకూలాంశం.
హైదరాబాద్, జనవరి 29 : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ రాంగోపాల్రావు అన్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం ద్వారా అంతర్జాతీయంగా రాణించగలమని చెప్పారు. ఆంగ్లం నేర్చుకొన్నవారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లో చదువుకొన్నవారు ఇంగ్లిష్లో తమ భావాలను వ్యక్తీకరించలేక ఇబ్బందులు పడుతుంటారని, స్థూలంగా ఇది వారి ఎదుగుదల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అవసరమని, ఇంగ్లిష్ నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదని స్పష్టం చేశారు. ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదువుకొన్న తాను బీటెక్లో ఇంగ్లిష్ మీడియంలోకి మారినట్టు తెలిపారు. పట్టుబట్టి కేవలం ఆర్నెల్లలోనే ఆంగ్లాన్ని అవపోసనపట్టానని వివరించారు. ఇంగ్లిష్ మీడియం బోధనపై ‘నమస్తే తెలంగాణ’తో రాంగోపాల్రావు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. రష్యా, చైనా, జపాన్ తదితర దేశాలవారు మాతృభాషలో చదువుకోవడం వల్లే బాగుపడ్డారనుకోవడం అపోహ మాత్రమే. ఆయా దేశాలు క్రమంగా మారుతున్నాయి. ఉన్నతవిద్యను ఆంగ్లీకరిస్తున్నాయి. సాంకేతిక, పరిశోధనా రంగాల్లో రాణించాలంటే ఇంగ్లిష్ అవసరమని గుర్తించి, ఇంగ్లిష్ మీడియంను ప్రొత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనాపత్రాలు, సాహిత్యం, శాస్త్రీయ పదజాలం ఇంగ్లిష్లోనే ఉంటున్నాయి. మాతృభాషల్లో చదివినవారు వెనుకబడిపోతుండగా, మొదటి నుంచి ఇంగ్లిష్ను ఒంటబట్టించుకొన్నవారు ముందంజలో ఉంటున్నారు.
ప్రాథమిక దశ నుంచే అలవర్చాలి
ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం వల్ల అనేక లాభాలుంటాయి. విద్యార్థి ముందే నేర్చుకొంటే ఆ తర్వాత ఇబ్బంది ఉండదు. అందుకే ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియంను అలవర్చాలి. చిన్నప్పటి నుంచి నేర్చుకొన్న వారే ఉన్నత ఉద్యోగాలు, విదేశీ విద్యలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివి, ఐఐటీల్లో చేరిన వారిలో అత్యధికులు ఇంగ్లిష్రాక ఇబ్బందిపడుతున్నారు. సబ్జెక్టులపై అవగాహన ఉన్నా ఇంగ్లిష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేక సతమతవుతున్నారు. ఇంగ్లిష్ను సబ్జెక్టుగా కాకుండా, మాధ్యమంగా నేర్పితేనే పిల్లలకు ప్రయోజనకరం.
మనఊరు-మనబడి మంచి కార్యక్రమం
మనఊరు-మనబడి మంచి కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు విద్యపై భారీగా ఖర్చుచేస్తున్నాయి. దక్షిణ కొరియా జీడీపీలో 4 శాతం, అమెరికా, చైనా 2 శాతం చొప్పున విద్యపై ఖర్చుపెడుతున్నాయి. మన దేశ జీడీపీలో 0.6 శాతం మాత్రమే ఖర్చుచేస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యారంగాల్లో భారీగా ఖర్చు చేసినందువల్లే ఆయా దేశాలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. మన దేశంలోను విద్యకు భారీగా నిధులను ఖర్చుచేయాలి.
యూసుఫ్గూడ బడి @ 1,095 మంది
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 : సాధారణంగా సర్కారు హైస్కూల్లో గరిష్ఠంగా ఎంత మంది విద్యార్థులు ఉంటారు? 300 నుంచి 400 మంది. కానీ, యూసుఫ్గూడ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియంలో ఉన్నత పాఠశాలలో 1,095 మంది ఉన్నారు. 40 మంది టీచర్లతో కొనసాగుతున్న ఈ బడిలో బాలురు 565 మంది, బాలికలు 530 మంది ఉన్నారు. తెలుగు మీడియంలో 105 మంది, ఉర్దూ మీడియంలో 42 మంది మాత్రమే ఉండగా.. ఇంగ్లిష్ మీడియంలో 848 మంది చేరడం విశేషం. ఈ పాఠశాల విద్యార్థులు గత రెండుమూడేండ్లుగా వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ఐఐటీ, ట్రిఫుల్ ఐటీలకు ఎంపికయ్యారు. స్కూల్ పూర్వవిద్యార్థులు 50 మంది పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.