హైదరాబాద్ : గుత్తికోయల దాడిలో రేంజర్ శ్రీనివాసరావు మరణించడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీనివాస రావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుంటే, విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయడం సరికాదన్నారు.
అటవీ ఆక్రమణలను సహించేది లేదని, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అటవీ అధికారులు మనోస్థైర్యం కొల్పోవద్దని సూచించారు. దాడి చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునారావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు.
రేంజర్ శ్రీనివాసరావు మండల అధికారి సంజీవరావుతో కలసి మంగళవారం అడవుల్లో చెట్లు నరుకుతున్న గుత్తి కోయల వద్దకు వెళ్లారు. చెట్లను నరకవద్దని గుత్తి కోయలకు అధికారులు సూచించడంతో తమను అడ్డుకోవద్దని అధికారులను బెదిరించడంతో పాటు రేంజర్ శ్రీనివాసరావుపై గొడ్డలితో దాడి చేశారు. దీంతో రేంజర్ శ్రీనివాసరావు అక్కడే పడిపోయారు. తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న శ్రీనివాసరావును అటవీ సిబ్బంది హుటాహుటినా కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.