మంథని, మార్చి 14: సాగునీటి కోసం( Cultivation Water) రాష్ట్రవ్యాప్తంగా రైతుల( Farmers) నిరసనలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో(Manthani) పెద్దపల్లి- కాటారం రహదారిపై ఆందోళనకు దిగారు. పురుగు మందుల డబ్బాలు, ఎండిన వరి పైరుతో ఎర్రటి ఎండలో నాలుగు గంటల పాటు బైఠాయించారు.
ఈ నెల7న మంథని మండలం సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మైదుపల్లి, ముత్తారం మండలం రామకృష్టాపూర్, గంగాపురి గ్రామాల రైతులు సాగునీటి కోసం నిరసన తెలుపగా ఆర్టీవో హనుమానా యక్ రెండు రోజుల్లో నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అయితే వారం దాటినా నీటిని విడుదల చేయడంతో మళ్లీ ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ చిన్న వరి మడి కూడా ఎండిపోలేదన్నారు.
కానీ కాంగ్రెస్ వచ్చిన వెంటనే మళ్లీ కరువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాలువలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన విషయం తెలుసుకున్న ఆర్డీవో హనుమానాయక్, ఈఈ బలరాంనాయక్ రైతుల వద్దకు వచ్చి శాంతిపజేసేందుకు విఫలయత్నం చేశారు. గతంలో నీళ్లిస్తామన్న హామీని ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. దీంతో గోదావరిఖని ఏసీపీ రమేశ్ రైతులతో మాట్లాడారు. సమస్యను కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.