అందోల్, జనవరి 30: ‘పదేండ్లు ఇరాం లేకుండా కరెంట్ వచ్చింది. బోరు వేస్తే పొలం మొత్తం తడిచే వరకు నడుస్తుండే. కరెంట్ పోతదేమో అన్న ముచ్చటే లేదు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడో పోతుందో తెల్వడం లేదు. రాత్రనక పగలనక పొలం కాడికి ఉరికే పరిస్థితి వచ్చింది’ అంటూ సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చింతకుంట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజులుగా కరెంట్ సరఫరా సక్రమంగా లేదని గ్రామస్థులు చెప్పారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు ఎప్పుడూ లేవని కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి గతంలో లాగా నిరంతరం కరెంట్ అందించి రైతాంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వారంలో కరెంట్ కష్టాలు మరింత ఎక్కవయ్యాయని, తరచూ కరెంట్ పోవడం, రావడంతో మోటర్లు, స్టాటర్లు కాలిపోతున్నాయని వాపోయారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా ఫలితం ఉండటం లేదని పేర్కొంటున్నారు.