హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఉగ్రవాదులు దేశంలో తొలిసారి డ్రోన్లతో బాంబుదాడులు జరుపటంతో ఇప్పుడు వాటి వినియోగంపై తీవ్ర చర్చ మొదలైంది. జమ్ముకశ్మీర్లో ఇటీవల శత్రుదేశం నుంచి వచ్చిన డ్రోన్లు భారత వైమానిక స్థావరంపై బాంబులేసిన విషయం తెలిసిందే. దేశంలో పలురంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశ భద్రతపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మన రాష్ట్రంలోనూ పంక్షన్లు, ప్రైవేటు కార్యక్రమాల్లో డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. హైదరాబాద్లో పలు కీలక రక్షణరంగ సంస్థలు ఉన్న నేపథ్యంలో డ్రోన్ల వినియోగంపై రాష్ట్రపోలీసులు, నిఘా వర్గాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. డ్రోన్ల వినియోగానికి డీజీసీఐ, స్థానిక పోలీసుల నుంచి తప్పక అనుమతి తీసుకోవాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ చాలావరకు అవి అమలు కావడంలేదు. నగరంలో దాదాపు 600 వరకు అనధికారిక డ్రోన్లు ఉండొచ్చని అధికారులు తెలిపారు. పెండ్లిళ్లు, ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతి లేకుండానే వాడుతున్నారు. పోలీసులు గుర్తించిన సందర్భాల్లో మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. 500 మీటర్ల వరకు గాల్లో ఎగరగలిగే డ్రోన్లు ఎక్కువగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా అరకిలో నుంచి కేజీ బరువు వరకు పైకి పంపవచ్చని, ఇది చాలా ప్రమాదకరమైన విషయమని ఓ అధికారి తెలిపారు.