హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు డిజిటల్ పాలన, ఆన్లైన్ సేవల గురించి ప్రభుత్వం గొప్పగా చెప్తున్నది. మరోవైపు ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులందరికీ జీతాలు చెల్లిస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతున్నది. కానీ, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేసే కంప్యూటర్ ఆపరేటర్లు జీతాలు సక్రమంగా అందక పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,773 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్ల సేవలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కొనసాగించేందుకు ప్రభుత్వం జీవో -1216 జారీ చేసింది. ఒకొకరికి నెలకు రూ.19,500 వేతనం చెల్లించేందుకు అనుమతించింది. కానీ, వారికి ఏప్రిల్ నుంచి ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. దీంతో నెలనెలా కుటుంబాలను పోషించుకోవాల్సిన సిబ్బంది జీతాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వేతనాల కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదలైనప్పటికీ సిబ్బందికి మాత్రం ఆ మొత్తం చేరలేదని ఉద్యోగవర్గాలు వాపోతున్నాయి. నిధుల విడుదల నుంచి క్షేత్రస్థాయిలో వేతనాల చెల్లింపు వరకు ఏ దశలో జాప్యం జరుగుతున్నదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. జీవోలో పేరొన్న రూ.19,500 చొప్పున 1,773 మందికి నెలకు సుమారు రూ.3.46 కోట్ల వేతన వ్యయం అవుతున్నది.
ఐదు నెలల బకాయిలు సుమారు రూ.17.28 కోట్ల చెల్లింపులు పెండింగ్ పెట్టినట్టవుతుంది. ఈ మొత్తంపై అధికారికంగా స్పష్టత ఇవ్వడంతోపాటు నిధులు ఎప్పుడు విడుదలయ్యాయి, చెల్లింపులు ఎందుకు నిలిచిపోయాయి, బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వం వెల్లడించాలని కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.