రఘునాథపాలెం(ఖమ్మం) : విజన్ ఉన్న మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Minister Puvvada) అన్నారు. ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రఘునాథపాలెం మండల కేంద్రంలోని రఘునాథపాలెం రైతు వేదిక, రాంక్యాతండా గ్రామాల్లో జరిగిన రైతు దినోత్సవంలో మంత్రి మాట్లాడారు.
తెలంగాణలో రైతుపక్ష పాతి ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. రైతు వేదికలు రైతుల సమావేశాలకు, సాగులోని మెళకువలు, పంట మార్పిడిపై శాస్త్రవేత్తల సూచనలకు, వ్యవసాయ అధికారుల కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2801 రైతు వేదికలు ఉండగా జిల్లాలో 123 ఉన్నట్లు చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రూ.85 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. విద్యుత్ సమస్యలు లేని రాష్ట్రంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని వెల్లడించారు.
ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు(MP Nama Nageshwar rao) మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు మెనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) విజయం తథ్యమని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు ఖాయమని అన్నారు.తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం కనీవిని ఎరుగని ప్రగతిని సాధించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బీపీ గౌతమ్, జడ్పీటీసీ మాళ్లోతు ప్రియాంక,ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.